శ్రీలంకలోని జాఫ్నా జైలులో నిర్బంధంలో ఉన్న నలుగురు కాకినాడ మత్స్యకారులు ఎట్టకేలకు విడుదలయ్యారు. వీరు స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ భవన్ అధికారులు చేసిన తక్షణ ప్రయత్నాలు ఫలించి, శ్రీలంక ప్రభుత్వం స్పందించి వారిని విడుదల చేసింది.
శ్రీలంక కోస్ట్ గార్డ్ సిబ్బంది ఈ నెల 26వ తేదీన నలుగురు జాలర్లను భారత్కు అప్పగించారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు సమీపంలోని తమిళనాడులోని మండపం వద్ద ఈ నలుగురిని భారత కోస్ట్ గార్డ్ సిబ్బందికి అప్పగించారు. మండపం నుంచి నౌకలో బయలుదేరిన ఈ మత్స్యకారులు ఈ నెల 30న కాకినాడకు చేరుకోనున్నారు.
2025 ఆగస్టు 3న కాకినాడకు చెందిన కె. శ్రీను వెంకటేశ్వర్, కర్రినోకరాజ్ బొర్రియా, చందా నాగేశ్వరరావు, బ్రహ్మనందం అనే నలుగురు మత్స్యకారులు పడవ కొనుగోలు చేయడానికి నాగపట్నం బయలుదేరారు. అయితే, తిరిగి వచ్చే సమయంలో నావిగేషన్ లోపం కారణంగా పొరపాటున వారు జాఫ్నా తీరం సమీపంలోకి చేరుకున్నారు. దీంతో వారిని శ్రీలంక కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకొని, జాఫ్నా పోలీసులకు అప్పగించింది.
హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవండి: పవన్ కల్యాణ్ పిలుపు
దొంగచాటు సంతకాలకు ‘AI’ చెక్: వైసీపీ ఎమ్మెల్యేలపై మాధవి రెడ్డి ఫైర్
2025 ఆగస్టు 4 నుంచి 52 రోజులుగా జాఫ్నా జైలులో నిర్బంధంలో ఉన్న ఈ మత్స్యకారులను స్వదేశానికి తిరిగి రప్పించే అంశంపై ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు క్రియాశీలంగా వ్యవహరించారు. వీరు జాఫ్నాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా నిరంతర సంప్రదింపులు జరిపారు. ఢిల్లీలోని కోస్ట్ గార్డ్ కార్యాలయం ద్వారా నలుగురు మత్స్యకారులను స్వదేశానికి రప్పించేలా ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ ప్రత్యేక మంతనాలు జరిపారు.
ఏపీ ప్రభుత్వం తక్షణం స్పందించి సంప్రదింపులు జరపడం వల్లే వారు త్వరగా విడుదలయ్యారని, లేదంటే ఈ నలుగురు మరో ఆరు నెలల పాటు జాఫ్నా జైల్లో గడపాల్సి వచ్చేదని అధికారులు తెలిపారు. ఈ నెల 26న శ్రీలంక అధికారులు నలుగురు మత్స్యకారులను భారత్కు అప్పగించడంతో వారి కుటుంబ సభ్యులు, స్వగ్రామంలో సంతోషం వ్యక్తమవుతోంది.

