లోక్ సభకు మాజీ మంత్రి అనిల్.! రాంగ్ ఛాయిస్.!

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయడం లేదు. లోక్ సభకు ఆయన్ని పంపాలని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. నర్సరావుపేట లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన సంగతి తెలిసిందే.

గతంలో అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా పని చేశారు. అదీ కీలకమైన జల వనరుల శాఖ మంత్రి పదవి ఆయన్ని వరించింది. ఆ పదవిలో ఆయన చేసిందేమీ లేదు. పోలవరం ప్రాజెక్టు విషయమై అనిల్ కుమార్ యాదవ్, విపక్షాలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. అత్యంత అసభ్యకరమైన ప్రవర్తన ఆయన చట్ట సభల్లో ప్రదర్శించడం చూశాం.

ఇప్పటికీ ఆయన తీరు మారలేదు. అంటే, మంత్రి పదవి పోయాక కూడా ఆయన తన పద్ధతి మార్చుకోలేదు. రాజకీయ ప్రత్యర్థుల్ని తూలనాడటమే కాదు, సొంత పార్టీ నేతలపైనా విరుచుకుపడ్డం అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యేకత.

నెల్లూరులోనే ఆయన్ని వుంచితే, నెల్లూరు వైసీపీ అభ్యర్థులకు ఇబ్బంది వస్తుందన్న కోణంలో, నర్సరావు పేటకు అనిల్ కుమార్ యాదవ్‌ని జగన్ పంపించేశారా.? అన్న అనుమానమూ లేకపోలేదు.

ఉద్దేశ్యం ఏదైనా, నర్సరావుపేట లోక్ సభ నియోజకవర్గానికి అనిల్ కుమార్ యాదవ్‌ని పంపడమంటే, ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది వైసీపీకి.. అన్న చర్చ వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. బలమైన ఓటు బ్యాంకూ అక్కడ వుంది.. ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి బాగానే వుంటాయ్.

కానీ, గ్రౌండ్ లెవల్ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయ్.! ఖచ్చితంగా వైసీపీ ఓడిపోయే సీటు ఇది.. అని స్థానిక వైసీపీ శ్రేణులే ఫిక్స్ అయిపోయాయ్.. అనిల్ కుామర్ యాదవ్ అభ్యర్థి అనగానే.!