నకిలీ మద్యం కేసులో అరెస్టయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం 10 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు వారిని తొలుత విజయవాడ జైలుకు, అనంతరం నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ కొనసాగనుంది.
అరెస్ట్, సుదీర్ఘ విచారణ: నిన్న (ఆదివారం) ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సిట్ అధికారులు జోగి రమేశ్ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించి సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న జనార్దనరావుతో జోగి రమేశ్కు ఉన్న సంబంధాలపై అధికారులు ప్రధానంగా ఆరా తీశారు. జోగి రమేశ్తో పాటు ఆయన సోదరుడు రామును కూడా విడివిడిగా, కలిపి ప్రశ్నించి వివరాలు సేకరించారు.

అర్ధరాత్రి తర్వాత వాదనలు, రిమాండ్: విచారణ అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేసి, సోదరులిద్దరినీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరుపక్షాల వాదనలు ప్రారంభమయ్యాయి. సుదీర్ఘ వాదనల అనంతరం ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున 5 గంటలకు న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ 10 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించారు.
జైలుకు తరలింపు: కోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు రామును తొలుత విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అనంతరం నెల్లూరు కేంద్ర కారాగారానికి మార్చారు.

