Pawan Kalyan: సమయం ఆసన్నమైంది: ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు అవసరం – ఉప ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సనాతన ధర్మ పరిరక్షణ అంశాన్ని తెరపైకి తెచ్చి సంచలనం సృష్టించారు. సనాతన సంప్రదాయాలు, హిందూ ఆచారాలు కేవలం భక్తి పరంపరలు మాత్రమే కాదని, భారతీయ సంస్కృతికి పునాది అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ధర్మ పరిరక్షణ కోసం తక్షణమే ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

తిరుమల లడ్డూ కేవలం తీపి పదార్థం కాదు, భక్తుల సమిష్టి భావోద్వేగం!: ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పవన్ కళ్యాణ్ సుదీర్ఘ పోస్ట్ చేశారు. అందులో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రాముఖ్యతను వివరిస్తూ, అది కేవలం యాత్రా స్థలం కాదని, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందువుల భక్తి, విశ్వాసాలకు ప్రతీక అని అభివర్ణించారు. “తిరుమల లడ్డూ కేవలం తీపి పదార్థం కాదు, భక్తుల సమిష్టి భావోద్వేగం. ప్రతి భక్తుడు లడ్డూని పంచుకోవడం దైవానుగ్రహం పంచుకున్నట్లే” అని పేర్కొన్నారు.

సనాతన ధర్మం జీవన విధానం; హేళన మన సంస్కృతిపై దెబ్బ!: సనాతన ధర్మం ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతలలో ఒకటిగా, కేవలం మతపరమైన వ్యవస్థ మాత్రమే కాకుండా, మనిషి నడవాల్సిన మార్గం, సమాజానికి నైతిక దిశ చూపించే జీవన విధానం అని పవన్ కళ్యాణ్ వివరించారు. భక్తుల సమిష్టి విశ్వాసం అయిన సనాతన ధర్మాన్ని హేళన చేయడం, ఎగతాళి చేయడం కేవలం వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, మన సంస్కృతిపైనే దెబ్బ కొట్టినట్లు అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

లౌకికవాదం (సెక్యులరిజం)పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్యులరిజం అనేది ఒకపక్కకు మాత్రమే పరిమితం కాకూడదని, అన్ని మతాలనూ, విశ్వాసాలనూ సమానంగా గౌరవించడమే నిజమైన లౌకికత అని ఆయన స్పష్టం చేశారు. ఒక మతంపై వ్యాఖ్యలు చేస్తూ మరొక మతాన్ని కించపరచడం సెక్యులరిజం కాదని, ఇలాంటి ధోరణులు సమాజంలో విభజనకు దారి తీస్తాయని ఆయన హెచ్చరించారు. ప్రతి సంవత్సరం సగటున 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

“సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చింది” అని పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు. ఈ బోర్డు హిందూ ఆలయాలు, ఆచారాలు, భక్తుల విశ్వాసాల పరిరక్షణ కోసం పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.

“ఈ బోర్డు ఏర్పాటు ఏ ఒక్క వర్గం నిర్ణయం కాకూడదు. అన్ని మతాల, అన్ని వర్గాల, అన్ని భాగస్వాముల ఏకాభిప్రాయంతో ఈ బోర్డు ఏర్పాటవ్వాలి. మన సనాతన సంప్రదాయాలు తరతరాలకు కొనసాగాలని మనందరం కృషి చేయాలి.”

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, భక్తుల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఢిల్లీ దొంగలు || Dasari Vignan Gives Full Clarity On Delhi Bomb Blast || Red Fort Incident || TR