పవన్‌ పై క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసు.. వాలంటీర్ వాంగ్మూలం రికార్డ్!

వారాహి యాత్రలో భాగంగా ఏలూరు సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో వాలంటీర్లు ఉమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. దీంతో పవన్ పై విజయవాడలో క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలైంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సృష్టించిన ప్రకంపనలు సంగతి తెలిసిందే. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటు… విజయవాడ సివిల్‌ కోర్టులో పవన్ కల్యాణ్ పై వేసిన క్రిమినల్‌ డిఫమేషన్‌ కేసుకు సంబందించి కీలక పరిణామం జరిగింది. ఇందులో భాగంగా పవన్‌ కేసు ఫైల్‌ చేసిన వాలంటీర్‌ స్టేట్‌ మెంట్‌ ను న్యాయమూర్తి రికార్డ్ చేశారు.

కాగా… వాలంటీర్లపై పవన్‌ చేసిన వ్యాఖ్యల పట్ల తాను మానసిక వేదనకు గురైయానని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని మహిళా వాలంటీర్‌ కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో వాలంటీర్‌ తరఫున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. ఇందులో భాగంగా… సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం విజయవాడ కోర్టులో కేసు దాఖలు చేశారు.

ఈ పిటిషన్ వేసిన సందర్భంగా తమకు న్యాయం చేయాలని మహిళా వాలంటీర్‌ కోరారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌ కళ్యాణ్‌ పై చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. పవన్ తమపై చేసిన తప్పుడు ఆరోపణలు తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో… తను భర్త చనిపోవడంతో పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నట్లు మహిళా వాలంటీర్ చెప్పుకొచ్చారు.

దీంతో వాలంటీర్ ఉద్యోగంతోనే తాను జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు వెల్లడించిన ఆమె… ఆ వ్యాఖ్యల ప్రభావంతో తనను చుట్టుపక్కల వారు ఉమెన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రశ్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిస్వార్థంగా సేవ చేస్తున్న తమపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిందలు వేశారని.. ఆయనపై చట్టపరంగా శిక్షించాలని మహిళా వాలంటీర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి… ఈ మేరకు సదరు వాలంటీర్‌ స్టేట్‌ మెంట్‌ ను రికార్డు చేశారు.