బాబును ప్రశ్నించేందుకు రెడీ… టీం వివరాలివే!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు శుక్రవారం వరుస షాకులు తగిలాయి. వాటిలో సీఐడీ తమ కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్ ని ఏసీబీ కోర్టు అనుమతించడం ఒకటి. దీంతో చంద్రబాబును సీఐడీ అధికారులు రెండు రోజులు పాటు విచారించనున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించిన టీం రెడీ అయ్యిందని తెలుస్తుంది.

చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా సీఐడీ అధికారుల ఆప్షన్ మేరకు విచారణ రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే జరిగేలా కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో టీం మొత్తం రాజమండ్రికి బయలుదేరింది!

ఈ నేపథ్యంలో శని, ఆదివారల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచరణకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా విచారణ అధికారుల వివరాలు వెల్లడించాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. అదే విధంగా… విచారణ జరుపుతున్న వీడియోలు, ఫొటోలు బయటకు విడుదల చేయకూడదని షరతులు విధించారు.

ఇక ఆదివారం సాయంత్రం కస్టడీ ముగిసిన అనంతరం చంద్రబాబుని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. అదేవిధంగా… కస్టడీ సమయంలో చంద్రబాబు సహకరించని పక్షంలో.. కస్టడీ పొడిగింపుకు అధికారులు కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబుని విచారించడానికి 12 మందితో టీం రెడీ అయ్యిందని తెలుస్తుంది.  నేతృత్వంలో విచారణ బృందం సిద్ధమవుతుందని సమాచారం. ఇందులో భాగంగా… ఒక సీఐ, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు, ఇద్దరు టైపిస్ట్‌ లు, ఒక వీడియోగ్రాఫర్ సహా 12 మందికి అనుమతి లభించిందని తెలుస్తుంది.