బాబుకు విడుదల… జైలు బయట కీలక వ్యాఖ్యలు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులుగా ఉంటున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు ఆరోగ్య కారణాల దృష్ట్యా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. అనంతరం ఈ నెల 28న మళ్లీ జైలుకెళ్లి లొంగిపోమని తెలిపింది!

దీంతో… టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా… జైలు వద్దకు భారీఎత్తున చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈ సమయంలో… నారా లోకేశ్‌, బ్రాహ్మణి, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, బుచ్చయ చౌదరి, కంభంపాటి రామ్మోహన్‌ రావు, పయ్యావుల కేశవ్‌, ఏలూరి సాంబశివరావు, జవహార్, టి.డి.జనార్దన్‌ తదితరులు జైలు వద్దకు విచ్చేశారు.

జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే తన మనవడుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న చంద్రబాబు… అక్కడకు తరలివచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం మైకందుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… రాష్ట్ర ప్రజలు, పార్టీ శ్రేణులు తనపై చూపించిన అభిమానాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.

ఇదే క్రమంలో… తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు మద్దతు తెలుపి, రోడ్లపైకి వచ్చి సంఘీభావం ప్రకటించినవారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. సైబర్‌ టవర్స్‌ నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో కృతజ్ఞత తెలుపుతూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారని.. తన విధానాల వల్ల లబ్ధిపొందిన ఐటీ ఉద్యోగులంతా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని బాబు అన్నారు.

ఇదే సమయంలో… తనకు సంఘీభావం తెలిపిన నేతలకూ, రాజకీయ పార్టీలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో భాగంగా స్వఛ్చందంగా బయటకు వచ్చి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు! ఇదే క్రమంలో బీజేపీ, సీపీఐ, బీఆరెస్స్, కొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం తనకు సంఘీభావం ప్రకటించారని.. వారందరికీ ధన్యవాదాలు అని అన్నారు. ఈ సందర్భంగా… తన 45ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎలాంటి తప్పుచేయలేదని చెప్పడం గమనార్హం!

కాగా… మధ్యంతర బెయిల్ మంజూరు అనంతరం బుధవారం వరకూ ర్యాలీలు చేపట్టొద్దని, మీడియాతో మాట్లాడొద్దని ఏపీ హైకోర్టు చంద్రబాబును ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే… చంద్రబాబు మాత్రం బయటకు రాగానే మైకందుకున్నారు. ఈ సందర్భంగా… 45ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పుచేయలేదని పేర్కొన్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.