మంత్రులపైనా ఐటి దాడులా ? అందరిలోను టెన్షన్

తీగను కదిలిస్తే డొంకంతా కదిలిందనేది తెలుగులో చాలా పాపులర్ సామెత. ఏపిలో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి కూడా ఇపుడలాగే ఉంది.  అధికారంలోకి వచ్చిన కొత్తల్లో చంద్రబాబునాయుదు చేసిన ఓ పనికిమాలిన పని ఇపుడు ప్రభుత్వంలోని అందరికీ చుట్టుకుంటోంది. త్వరలో మంత్రులపై ఐటి దాడులు జరగవచ్చని తెలియటంతో మంత్రులందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది.

ఏరోజు ఏ మంత్రి ఇంటిపై దర్యాప్తు సంస్ధలు దాడులు జరుపుతాయో తెలీక అందరు అయోమయంలో పడిపోయారు. పైగా మంత్రులతో మాట్లాడుతూ ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబే హెచ్చరించటంతో మంత్రుల మానసిక పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.

అమరావతిలో బుధవారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగాల్సుంది. అయితే, సీనియర్ నేత ఎంవివిఎస్ మూర్తి రోడ్డు ప్రమాదంల మరణించటంతో వాయిదా పడింది. అయితే, అదే సమయంలో హైదరాబాద్ లో ఓటుకునోటు కేసులో ఐటి శాఖ ఉన్నతాధికారులు రేవంత్ ను ప్రశ్నించటం మొదలు పెట్టారు. ఎటూ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది చర్చంతా రాజకీయాలపైకి మళ్ళింది. అదే సందర్భంలో ఓటుకునోటు కేసు విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో కావాలనే ఓటుకునోటు కేసును కావాలనే తీసుకొచ్చారంటూ చంద్రబాబు అనుమానించారు. కేసు విచారణను వేగవంతం చేయటం ద్వారా తెలుగుదేశంపార్టీని కట్టడి చేయాలని చూస్తున్నట్లు కెసియార్ పేరెత్తకుండానే కామెంట్  చేశారు. కేసు విచారణ వెనుక బిజెపి, టిఆర్ఎస్ కుట్ర ఉందంటూ పాత పాటే పాడారు. అదే సమయంలో ఏపిలో కూడా పలువురు మంత్రులపై ఐటి దాడులు జరగొచ్చని సమాచారం ఉందంటూ మంత్రులను హెచ్చరించారు. ఎవరి జాగ్రత్తలో వారుండాలని కూడా అలర్టు చేశారు.

కేసులో సూత్రదారి, ఇరుక్కున్నారు కాబట్టి చంద్రబాబు టెన్షన్ పడటంలో తప్పులేదు. కానీ ఏ సంబంధం లేని మంత్రుల్లో ఎందుకు టెన్షన్ ? ఎందుకంటే, నామినేటెడ్ ఎంఎల్ఏతో బేరం కుదుర్చుకున్న రూ. 5 విషయంతో పాటు  అడ్వాన్సుగా ఇవ్వజూపిన రూ 50 లక్షలు ఎవరివి ? ఎక్కడివి ? అని తెలుసుకునేందుకే మంత్రులపై ఐటి దాడులు జరగొచ్చని చంద్రబాబు అనుమానం.