‘అన్నాదురై – అన్న ఎన్టీఆర్’… బాబును బంతాడేస్తున్న నెటిజన్లు!

“నాలుకకు నరం లేదు” అనేది ఒక ప్రసిద్ధ తెలుగు జాతీయం. అంటే.. నాలుకకు ఎముకలు లేదా గట్టి నరాలు ఉండవు కాబట్టి, అది ఎలాగైనా తిరుగుతుండటం వల్ల… మనిషి తన మాటను నిలబెట్టుకోకుండా, అబద్ధాలు మాట్లాడుతూ, పరిస్థితులకు అనుగుణంగా మాట మార్చడాన్ని ఈ సామెతతో పోలుస్తారు. అయితే తమిళనాడు ఎన్నికల పర్యటనలో ఉన్న చంద్రబాబు.. డీఎంకే పై చేసిన ఓ విమర్శ ఇప్పుడు ఈ జాతీయాన్ని మరోసారి తీవ్రంగా చర్చకు తెచ్చింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారుతోంది.

తమిళనాడులో ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. తొలుత డీఎంకే, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి.. అన్నాడీఎంకే, బీజేపీ కూటమికీ మధ్య మాత్రమే పోటీ అనుకుంటున్న వేళ… టీవీకే పార్టీ విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సమయంలో ఆయనకు అభిమానులు, యువత, మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చిందనే చర్చ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో ద్విముఖ పోటీ కాస్తా రసవత్తరమైన త్రిముఖ పోటీగా మారింది.

సరిగ్గా ఈ సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుపెట్టి డీలిమిటేషన్ ను తెరపైకి తెచ్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం! క్లారిటీ లేని ఆ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని.. ఢిల్లీలో దక్షిణాది రాష్ట్రాల గొంతు మూగబోతోందని ఆందోళనలు మొదలయ్యాయి. ఈ విషయంలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి, సీఎం స్టాలిన్ కి మాంచి క్రెడిట్ దక్కిందని చెబుతారు. దీంతో… డీలిమిటేషన్ అంటూ బీజేపీ వేసిన పాచిక పారలేదు సరికదా.. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేకి స్థానికంగా చాలా బలాన్ని తెచ్చిందని అంటున్నారు.

మరోవైపు… ఈ దెబ్బతో బీజేపీ – అన్నాడీఎంకే కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యిందని చెబుతున్నారు పరిశీలకులు. పైగా… తమిళనాడు ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం బీజేపీ బలంగా చేసిందంటూ ఇటీవల జరిగిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు. దీంతో… డీఎంకే కీ టీవీకేకీ మధ్య బలమైన పోటీ ఉండొచ్చనే విశ్లేషణలూ తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో… ఎన్డీయే తరుపున తమిళనాడులోని తెలుగు ప్రజల వద్దకు ఎన్నికల ప్రచారానికి వెళ్లారు చంద్రబాబు.

ఈ సందర్భంగా ఆయన చేసిన పలు వ్యాఖ్యలకు తీవ్రంగా కౌంటర్స్ పడుతున్నాయని అంటున్నారు. ఉదాహరణకు… తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారంపై సీపీఐ నారాయణ స్పందిస్తూ… బాబు గాలి తీసేశారు. ఇందులో భాగంగా… జ‌య‌ల‌లిత సీఎంగా ఉన్న‌ప్పుడు తెలుగు పాఠ‌శాల‌ల‌న్నీ మూసివేసేందుకు తీర్మానం చేశార‌ని.. అప్పుడు క‌మ్యూనిస్టు పార్టీ ఆధ్వ‌ర్యంలో గ‌ట్టిగా ఫైట్ చేశార‌ని గుర్తు చేస్తూ… అప్పుడు తెలుగు పాఠ‌శాల‌ల మూసివేత ఆగిపోయింద‌ని అన్నారు.

అయితే… ఆనాడు తెలుగు ప్ర‌జానీకానికి అన్యాయం జ‌రుగుతోంద‌ని, జ‌య‌ల‌లితతో మాట్లాడాల‌ని తాము చంద్రబాబుని కోర‌గా, ఆయ‌న వెళ్ల‌లేద‌ని..అప్పుడు తమిళ‌నాడులోని తెలుగు ప్ర‌జానీకానికి అన్యాయం జ‌రుగుతుంటే చంద్ర‌బాబు చూస్తూ ఊరుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాంటి చంద్రబాబు… ఇప్పుడు బీజేపీకి ఓటు వేయాల‌ని తమిళ‌నాడులోని తెలుగు వారిని ఏ ముఖం పెట్టుకుని అడుగుతారంటూ నిలదీశారు. ప్రచారానికి వెళ్లమని మోడీ ఆదేశించ‌గా, చంద్ర‌బాబు ల‌గెత్తుకెళ్తున్నార‌ని ఎద్దేవా చేశారు.

ఇక తమిళనాడులో చంద్రబాబు చేసిన ప్రసంగంపైనా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగా కోయంబత్తూరులో పలువురు ప్రముఖులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన చంద్రబాబు… ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా… విజయ్ టీవీకే పార్టీపై స్పందిస్తూ… తమిళనాడులో కొత్తగా పార్టీని ప్రారంభించిన విజయ్ పార్టీపై తాను ఎలాంటి కామెంట్ చేయనని.. ఎన్నికల్లో ప్రజలే తీర్పు నిస్తారని స్పష్టం చేశారు.

దీంతో… ఇటీవలే కొత్తగా పార్టీ పెట్టి, తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలకు చెమటలు పట్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న టీవీకేను చంద్రబాబు తేలిగ్గా తీసుకున్నట్లు మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. అదంతా ఒకెత్తు అయితే… అధికార డీఎంకే… కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాన్ని చంద్రబాబు ఆక్షేపించడం వైరల్ గా మారింది. పైగా అందుకు ఆయన చెప్పిన కారణం మరింత చర్చనీయాంశంగా మారుతోంది.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన చంద్రబాబు… కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ అన్నాదురై 1967లో డీఎంకే పార్టీని ప్రారంభిస్తే, స్టాలిన్ నాయకత్వంలోని ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తోందని ఆక్షేపించారు. సరిగ్గా ఇక్కడే బాబుని నెటిజన్లు ఓ ఆటాడేసుకుంటున్నారు.

ఇందులో భాగంగా… తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడటానికి, కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ఎన్టీఆర్.. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారని.. ఆ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని.. అప్పుడు తనను ఆదేశిస్తే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్టీఆర్ పై పోటీ చేస్తానని అన్నారని గుర్తుచేస్తున్నారు నెటిజన్లు.

అదంతా ఒకెత్తు అయితే… కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు… అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని, వేదికలపై కాంగ్రెస్ నేతలతో కలిసి చేతులు ఊపారని.. అప్పుడు మోడీ, అమిత్ షాలను వీర తిట్లు తిట్టారని… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిడుతూ.. మోడీని వీరుడు, శూరుడు అంటున్నారని చెబుతున్నారు.

అలాంటి చంద్రబాబు… 1967లో అన్నాదురై పెట్టిన డీఎంకే.. ఇప్పుడు కాంగ్రెస్ తో కలవడాన్ని ఆక్షేపిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా విమర్శలు చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని ఎద్దేవా చేస్తున్నారు. దీంతో… చంద్రబాబు తన ప్రచారంతో డీఎంకే నెత్తిన పాలు పోసినట్లున్నారనే చర్చ తమిళనాడులోని తెలుగు సమాజంలో మొదలైందని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే… తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వేర్వేరు రాష్ట్రాలైనా ద్రావిడ మూలాలు ఒకటేనని, ద్రావిడ సంస్కృతి నుంచి వచ్చినవారిమేనని.. ఎప్పుడూ అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన వారిమేనని చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసక్తికరంగా… చంద్రబాబు నాయుడికి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్ర విభజనపై టీడీపీ మిత్రపక్షాల నేతలు చేస్తున్న వరుస ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ… తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తున్న ఆ వ్యాఖ్యల్ని సహించబోమన్నారు.

ఈ సందర్భంగా… మొన్న.. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే… గతంలో ప్రధాని మోడీ చేసిన “తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు” వ్యాఖ్యలు అనుచితమన్నారు.

అదేవిధంగా… ఆంధ్రా – తెలంగాణ విభజనను భారత్ – పాకిస్థాన్ విభజనతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పిన పొన్నం ప్రభాకర్… బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్‌ లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మేలా ఉన్నాయని.. ఆ వ్యాఖ్యల్ని లోక్‌ సభ రికార్డుల నుంచి తొలగించేలా స్పీకర్‌ కు లేఖ రాయాలని చంద్రబాబును డిమాండ్‌ చేశారు.

దీంతో… తమిళులు, ఆంధ్రులు అన్నదమ్ముల్లా ఉండాల్సినవారే కానీ.. అన్నదమ్ములుగా ఉండి కేవలం ప్రాంతాలుగా విడిపోయిన ఆంధ్ర – తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఎన్డీయే కూటమిలోని నేతలు చేస్తోన్న వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించాలన్నట్లుగా పొన్నం రాసిన లేఖ ఉందని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలోనే… చెప్పే మాటలను, చేసే పనులకు ఎంతోకొంత పొంతన ఉండాలని.. అప్పుడే మనిషికి క్రెడిబిలిటీ ఉంటుందని చెబుతున్నారు.