వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బోరుగడ్డ అనిల్ కు మరోసారి ఊహించని షాక్ తగిలింది. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న అనిల్ కు గుంటూరు నాలుగో కోర్టు తాజాగా 14 రోజుల రిమాండ్ విధించింది. 2016లో పెదకాకాని మండల సర్వేయర్ మల్లికార్జునరావును బెదిరించిన కేసులో అనిల్ ఏడేళ్లుగా కోర్టు హాజరుకు రావడం లేదని పోలీసులు గుర్తించి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
ఇటీవల అనంతపురం జైలులో ఉన్న అనిల్ను పీటీ వారెంట్పై గుంటూరుకు తరలించిన పోలీసులు, ఆయనను కోర్టులో హాజరు పరిచారు. గుంటూరు ఆరవ కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో, నాలుగో కోర్టు ఇన్చార్జి మెజిస్ట్రేట్ శోభారాణి ఈ కేసును చూసి రిమాండ్ తీర్పు వెలువరించారు. వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అనిల్ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇక మరో కేసులో అనిల్కు మరోసారి కోర్టు ఎదురుదెబ్బ తగిలింది. నరసరావుపేట రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం. గాయత్రి అనిల్ వేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. ఫిరంగిపురం పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో అనిల్ మార్చి 24న కోర్టులో హాజరయ్యారు. అప్పటి నుంచే రిమాండ్ కొనసాగుతోంది.
ఇప్పటివరకు అనిల్పై పలు క్రిమినల్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. రాజకీయంగా చురుగ్గా వ్యవహరించిన అనిల్, రౌడీ షీటర్గా కూడా గుర్తింపు పొందారు. కానీ న్యాయ వ్యవస్థ అతడిపై కఠినంగా స్పందించడంతో, వరుసగా రిమాండ్లు అనిల్కు పెద్ద సమస్యగా మారాయి. అధికారికంగా పార్టీ స్థాయిలో స్పందన లేదుగానీ, ఈ పరిణామాలు వైసీపీకి తీవ్ర ఇబ్బందిగా మారే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి.