బాలయ్య విత్ చిరు @ అన్ స్టాపబుల్… పార్టీ పనుల నుంచి బయటకు?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు సుమారు నెల రోజులుగా రాజమండ్రి కేంద్రకారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే… చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీలో జరిగిన పరిణామాలు, హడావిడి, అనంతరం సైలెన్స్, కొత్త ముఖాలు తెరపైకి రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక్కడ బాలయ్య కీలకంగా మారారు!

అవును… చంద్రబాబు అరెస్ట్ తర్వాత బాలకృష్ణ కాస్త అగ్రెసివ్ గానే కనిపించారు. బాబు బావ లేని లోటు తాను తీరుస్తానన్నస్థాయిలో మీటింగ్ పెట్టారు. బాబు అరెస్ట్ వార్త విని చనిపోయినవారి కుటుంబాలకు తాను అండగా ఉంటానన్నారు, ఓదార్పు యాత్ర కూడా చేస్తానన్నారు. కట్ చేస్తే.. ఆ ప్రకటనల అనంతరం బాలయ్య సైడ్ అయిపోయారు. ప్రస్తుతం సినిమాలు, ఆహా షో లతో బిజీ అయిపోయారు!

పార్టీ అధినేత చంద్రబాబు జైల్లో ఉంటే… నారా లోకేష్ ఢిల్లీలోనే ఉంటున్నారు. అది అరెస్ట్ భయం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పొత్తు ప్రకటన్ చేశారు. అనంతరం ఎవరూ ఊహించని రీతిలో బాలయ్య సైడైపోయారు. కాదు కాదు ఓ వ్యూహం ప్రకారమే ఆయన్ను సైడ్ చేశారని నందమూరి అభిమానులు వాపోతున్నారు.

అవును… చంద్రబాబు జైలులో ఉన్నారు, లోకేష్ ని కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోన్న ఈ దశలో పార్టీ బాధ్యతల్ని బాలయ్య భుజానికెత్తుకోవడం కొంతమంది టీడీపీ పెద్దలకు ఇష్టంలేదని అంటున్నారు. వారు పూర్తిగా ములాకత్ లో భాగంగా బాబు ఆదేశాలతో పార్టీ మళ్లీ నారావారి చేతుల్లోనుంచి నందమూరి చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారని అంటున్నారు.

అందులో భాగంగానే బాలకృష్ణను తెలివిగా తప్పించారని, అదే విధంగా.. తెరపైకి భువనేశ్వరి, బ్రాహ్మణిని తెచ్చారని.. ఫలితంగా బాలయ్య ఎవరో చెప్పినట్టుగానే రాజకీయాలు పక్కనపెట్టి షూటింగుల్లో బిజీ అయిపోయారని అంటున్నారు. అలా అని మరీ దూరం పెడితే బాగోదనుకున్నారో ఏమో కానీ… తెలంగాణ టీడీపీపై ఫోకస్ పెట్టమని సూచించారని సమాచారం.

ఆ సంగతి అలా ఉంటే… ఏపీ పాలిటిక్స్ నుంచి వ్యూహాత్మకంగా పక్కకు పంపబడిన బాలయ్య… అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ కోసం రెడీ అవుతున్నారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్రధానంగా చిరంజీవితో మొదలవుతుందనే గాసిపిస్ వినపడుతున్నాయి. ఏపీలో జనసేన – టీడీపీ దోస్తీ నేపథ్యంలో చిరంజీవితో బాలయ్య ఇంటర్వ్యూపై జనల్లో ఆసక్తి ఉంటుందని ఆహా యాజమాన్యం భావిస్తుందని అంటున్నారు.

ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి… టీడీపీ అధినేత చంద్రబాబు బావమరిది బాలయ్యతో… ఎన్నికలు సమీపిస్తున్న వేళ షో అంటే కచ్చితంగా హాట్ టాపిక్ గా మారుతుందని అంటున్నారు. ఏమి జరగబోతుందనేది వేచి చూడాలి!