ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనం కోసం సీఎం చంద్రబాబు కేబినెట్ లోని మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 21న ప్రారంభమైన ఈ పర్యటన.. ఏప్రిల్ 27 వరకు కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఏపీ మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్.. సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య శాఖ మంత్రి హువాంగ్ తో సమావేశమయ్యారు!
ఈ సందర్భంగా… సింగపూర్ లో ప్రజల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఆ దేశ చట్టాలపై షణ్ముగం మంత్రులకు వివరించారు. నేషన్ ఫస్ట్ గవర్నెన్స్ తో పాటు రాజకీయ జవాబుదారీతనంపైనా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే అక్కడి అవర్ టాంపైన్స్ హబ్ ను సందర్శించిన మంత్రుల బృందం… అక్కడున్న థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, లైబ్రరీలు, మాల్స్, ఫెస్టివ్ ఆర్ట్ థియేటర్ పరిశీలించింది. ఈ శిక్షణలు, పరిశీలనలు, సందర్శనలు వారం రోజుల పాటు జరగనున్నాయి.
ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా డిజిటల్ గవర్నెన్స్, పబ్లిక్ సర్వీస్ డెలివరీ, ఎకనామిక్ డెవలప్మెంట్ & పాలసీ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై మంత్రులు నైపుణ్యం సంపాదించనున్నారని అంటున్నారు. ఇక.. ఈ పర్యటన నిమిత్తం మొత్తం సుమారు రూ.95 లక్షలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ సంగతి అలా ఉంటే… వారం రోజుల్లో ఈ మంత్రులకు ఇంత సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం ఉంటుందా అనే సందేహం పలువురు వ్యక్తపరుస్తున్నారు.
ఎందుకంటే… డిజిటల్ గవర్నెన్స్, పబ్లిక్ సర్వీస్ డెలివరీ, ఎకనామిక్ డెవలప్మెంట్ & పాలసీ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్మెంట్ మొదలైనవి.. నిజానికి పీహెచ్డీ స్థాయి అంశాలని అంటున్నారు. అలా అని ఈ వారం రోజుల శిక్షణ ఏమీ అకడమిక్ కోర్సు కాదు కానీ… కనీస అవగాహన రప్పించే ప్రయత్నమని అంటున్నారు. కారణం… ఒక వారంలో పైన పేర్కొన్న విషయాలపై పూర్తి నైపుణ్యం, పరిజ్ఞానం వచ్చే అవకాశం ఆల్ మోస్ట్ లేదనేది నిపుణుల మాటగా ఉంది!
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… సింగపూర్ కి వారం రోజుల ట్రైనింగ్ నిమిత్తం వెళ్లిన మంత్రులు.. తిరిగి ఏపీకి వచ్చిన తర్వాత వారి వారి శాఖలకు సంబంధించిన అధికారులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు! ఫలితంగా… ఆ అధికారులు, ఈ మంత్రులు కలిసి.. ఏపీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది సీఎంతో కలిసి ఆలోచించి, ముందుకు వెళ్తారన్నమాట!
ఈ సందర్భంగా తాజా పర్యటనపై తీవ్ర విమర్శలు వస్తోన్నాయి. అలా అని ఇవి కేవలం ప్రతిపక్ష వైసీపీ నుంచి మాత్రమే వస్తున్నాయనుకుంటే పొరపాటే. ఈ పర్యటనను తప్పుబడుతున్నవారిలో.. మాజీ ఐఏఎస్ అధికారులు, ఆత్మాభిమానం కలిగిన తెలుగువారు, చంద్రబాబు సీనియారిటీని గుర్తించేవారూ సైతం ఉండటం గమనార్హం. ఇప్పటికే ఈ పర్యటనను “జంకెట్ టూర్” అంటూ వైసీపీ విమర్శించింది.
ఈ క్రమంలో.. చంద్రబాబుకు పరిపాలనలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉందని.. ఆయన అనుభవం ముందు ఎవరైనా బలాదూర్ అని ఆ పార్టీ వారే చెబుతున్నారని.. పైగా ప్రపంచానికి పాఠాలు చెప్పిన అనుభవం ఆయన సొంతమని.. అలాంటి చంద్రబాబు తన కేబినెట్ మంత్రులను సింగపూర్ లో శిక్షణకు పంపడం అర్ధంలేని పని అని అంటున్నారు కమ్యునిస్టు నేతలు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న వాళ్లు సింగపూర్ లో పరిపాలనా పాఠాలు నేర్చుకుంటామని వెళ్లటం సిగ్గుచేటని చెబుతున్నారు.
అదేవిధంగా… రాష్ట్రం నుంచి మంత్రులు సింగపూర్ లో పరిపాలన నేర్చుకునేందుకు వెళుతున్నట్లు చెప్పి వ్యాపారాలు చేసుకునేందుకు వెళుతున్నారని సీపీఐ నేతలు విమర్శించారు. ఇంతకు ముందు అధికారుల బృందం వెళ్లి వచ్చిందని, అలాగే కొంతమంది రైతుల బృందం కూడా వెళ్లి వచ్చిందని, వారు ఇక్కడి వారికి ఏమి నేర్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ అన్నీ చెప్పే చంద్రబాబు తన మంత్రులకు శిక్షణ ఇవ్వలేరా అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో… సింగపూర్ అనేది సిటీ స్టేట్ అని.. దానికి రూరల్ బ్యాగ్రౌండ్ లేదని.. ఏపీలో ఉన్న సామాజిక నేపథ్యం అక్కడ లేదని.. అటువంటి స్టేట్ నుంచి పరిపాలన నేర్చుకోవడం అంటే సిగ్గు చేటని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు! ఈ సందర్భంగా ఓ కీలక విషయం వెల్లడించారు.
ఇందులో భాగంగా… సింగపూర్ లో జీరో అవినీతి ఉందని.. అక్కడ ఒక చిన్న తప్పు చేసి, మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారని.. ఆయన సీఎం చంద్రబాబుకు చాలా మంచి సన్నిహితుడని చెబుతూ.. సింగపూర్ నుంచి నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే అది “అవినీతి లేని పాలన” గురించి అని.. ఆ ఒక్కటీ కరెక్ట్ గా తెలుసుకుంటే బాగుంటుందని అన్నారు.
దీంతో.. ఈ ఒక్క విషయం చంద్రబాబుకు చెప్పి, పాటిస్తే.. సింగపూర్ టూర్ కి సార్థకత వచ్చినట్లేనని అంటున్నారు నెటిజన్లు, పరిశీలకులు.!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… సింగపూర్ వైశాల్యం 728 చదరపు కిలోమీటర్లు కాగా.. జనాభా సుమారు 60 లక్షలు. అంటే.. దాదాపు ఆంధ్రప్రదేశ్ లోని ఒక్క జిల్లాతో సమానం! అయితే… ఆంధ్రప్రదేశ్ వైశాల్యం 1.6 లక్షల చదరపు కి.మీ. కాగా.. జనాభా 5 కోట్లకు పైనే. అంతే కాదు.. ఏపీలో వైవిధ్యమైన గ్రామీణ-పట్టణ సమస్యలు, వ్యవసాయం, నీటి సంక్షోభం, ఇరిగేషన్ వంటి సవాళ్లు కీలకంగా ఉన్నాయి. మరోవైపు సింగపూర్ లో కరప్షన్ జీరో కాగా.. పబ్లిక్ సర్వీసెస్ అత్యంత సమర్థవంతమైనవి అని అంటారు!
అయినప్పటికీ ఈ పర్యటనపై ప్రభుత్వం తన వాదన వినిపిస్తూనే ఉంది. ఇందులో భాగంగా… ఈ పర్యటనతో సింగపూర్ మోడల్ కాపీ చేయడం కాదని, బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకోవడమేనని అంటోంది. సింగపూర్ నుంచి నేర్చుకుంటే వేగం పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు.
ఏది ఏమైనా… వారం రోజుల ఈ సింగపూర్ పర్యటన ఏపీ మంత్రులకు అవినీతిరహిత పాలనపైనా, రాజకీయ జవాబుదారీతనంపైనా ఏ మేరకు అవగాహన కల్పిస్తుందనేది వేచి చూడాలి.
