మరో టిడిపి ఎంపి రాజీనామా..చంద్రబాబుకు షాక్

ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ చంద్రబాబునాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అమలాపురం ఎంపి పందుల రవీంద్రబాబు టిడిపికి రాజానీమా చేయనున్నట్టు సమాచారం. లోటస్ పాండ్ లోని నివాసంలో జగన్మోహన్ రెడ్డితో భేటీకి రవీంద్ర అపాయింట్మెంట్ తీసుకున్నారు. జగన్ ను కలుస్తున్నారంటేనే టిడిపికి రాజీనామా చేయబోతున్నారనటంలో సందేహం లేదు. కొంత కాలంగా రవీంద్రకు చంద్రబాబుకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. దానికితోడు వచ్చే ఎన్నికల్లో రవీంద్ర అసెంబ్లీకి పోటీ చేయాలని అడిగితే చంద్రబాబు స్పందించలేదట. దాంతో టిడిపికి గుడ్ బై చెప్పాలని ఎంపి నిర్ణయించుకున్నారు.

నిజానికి రవీంద్ర నాలుగు రోజుల క్రితం అనాకపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ తో పాటే వైసిపిలో చేరాల్సింది. అయితే పార్టీ మారనున్న విషయం తెలుసుకుని చంద్రబాబు ఎంపితో మాట్లాడారు. చంద్రబాబు ఎంత మాట్లాడినా ఎంపిగా పోటీ చేయటానికి రవీంద్ర ఇష్టపడలేదు.  అదే సమయంలో ఎంపిని ఎంఎల్ఏగా పోటీ చేయించటానికి చంద్రబాబు కూడా సుముఖంగా లేరు.

ఎందుకంటే, అమలాపురం ఎంపిగా పోటీ చేయటానికి టిడిపి నేతలెవరు ఇష్టపడటం లేదు. రవీంద్ర స్ధానంలో ఎంపిగా పోటీ చేయించటానికి చంద్రబాబు కొందరు నేతలతో మాట్లాడారు. అయినా వారెవరూ సుముఖత చూపలేదు. దాంతో చేసేది లేక రవీంద్రనే ఎంపిగా పోటీ చేయాలని చంద్రబాబు చెప్పేశారు. అందుకు రవీంద్ర అంగీకరించలేదు. నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై పెరిగిపోయిన వ్యతిరేకత వల్ల గెలుపుపై అనుమానంతోనే పోటీ నుండి తప్పుకుంటున్నారు. ఈ కారణంతోనే రవీంద్ర టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరి ఏదో ఓ అసెంబ్లీ నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.