టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, న్యాయాన్ని తాకట్టు పెట్టి పగ తీర్చుకోవడం ధర్మంగా భావిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారంలో ఉన్నవారు తామేం చేసినా సరే తప్పుకాదనుకునే ధోరణిలో ఉన్నారని విమర్శించారు.
ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు వ్యవహారాన్ని ఉద్దేశించి అంబటి, ఇది చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని అన్నారు. డీజీపీ స్థాయికి వెళ్లాల్సిన అధికారి అనే న్యాయంగా పనిచేసినందుకే అరెస్ట్ అయ్యాడని ఆరోపించారు. చంద్రబాబును గతంలో అరెస్ట్ చేసినందుకే పీఎస్ఆర్పై ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారని ఆరోపించారు. అదే విధంగా, మాజీ వైసీపీ నేత రాజ్ కసిరెడ్డిపై కూడా కక్ష తీర్చుకునే విధంగా కేసులు బనాయించారని మండిపడ్డారు.
జత్వాని అరెస్టు విషయంలో అంబటి మాట్లాడుతూ, ఆమె ముంబైలో బ్లాక్ మెయిలర్గా గుర్తింపు ఉన్న వ్యక్తి అని, ఈ అరెస్టు చట్టబద్ధమైనదే అయినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయాన్ని దిశా మార్చే ప్రయత్నంగా చూపుతోందని అన్నారు. ఇక లోకేశ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ఉర్స్’ సంస్థకు రూ. 3 వేల కోట్ల విలువైన ఆస్తులు బదలాయించారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారాన్ని దాచిపెట్టేందుకే పీఎస్ఆర్, కసిరెడ్డిలపై కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.
గోరంట్ల మాధవ్ కేసులో 11 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేయడంపై తీవ్రంగా స్పందించిన అంబటి, దీనిపై హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు పొడవైన వ్యాఖ్యలు చేస్తూ పోలీసుల వ్యవహారంపై మొట్టికాయలు వేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. లోకేశ్ ఆధిపత్యంలో అధికారులు వ్యవహరిస్తున్నారని, ఇటువంటి చర్యలకు కచ్చితంగా ప్రజల నుంచి సరైన కౌంటర్ వస్తుందని హెచ్చరించారు.