బయటపడుతున్న ‘కే’ అరాచకాలు

శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, కుటుంబసభ్యుల బాధితులు ఒక్కొక్కరు బయ టకు వస్తున్నారు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కూతురు విజయలక్ష్మి, కొడుకు శివరామకృష్ణలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. తండ్రిని అడ్డం పెట్టుకుని కూతురు, కొడుకు పై నియోజకవర్గాల్లో తమ అవినీతి వరదను ఐదేళ్ళపాటు పారించారు.

మొత్తానికి వాళ్ళ పాపం బద్దలై పార్టీతో పాటు కోడెల కూడా దారుణంగా ఓడిపోయారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే కోడెల కుటుంబం సాగించిన అరాచకాలపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ సుమారుగా 15 మంది పై రెండు నియోజకవర్గాల్లో చేసిన ఫిర్యాదులను పోలీసులు రిజిస్టర్ చేశారట.

అధికారంలో ఉండగా జనాలను బెదిరించి దోచుకున్న మొత్తాలని ఇపుడు కుటుంబసభ్యులు బయటకు కక్కుతున్నారట. పోలీసు స్టేషన్లో తమపై కేసులు నమోదైతే ఎక్కడ ఇబ్బందులు పడాల్సొస్తోందో అన్న భయంతోనే తమ బాధితులతో రాజీ చేసుకుంటున్నట్లు పోలీసులే చెబుతున్నారట. అంటే పోలసు స్టేషన్లో తమపై ఫిర్యాదు అందిందని తెలియగానే బాధితుడిని పిలిపించి రాజి చేసుకుంటున్నట్లు సమాచారం.

పై రెండు నియోజకవర్గాల్లో ఏ కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టాలన్నా, ఎవరు వ్యాపారం చేసుకోవాలన్నా ? సంతానానికి డబ్బులు సమర్పించుకోవాల్సిందే. దాన్నే పాదయాత్రలో జగన్ కూడా కోడెల ట్యాక్స్ అంటూ మండిపడ్డారు. పై రెండు నియోజకవర్గాల్లో కె ట్యాక్ అంటే తెలియని, కట్టకుండా తప్పించుకున్న వ్యాపారస్తులుండరనే అంటారు జనాలు.

వీళ్ళ ఆగడాలు భరించలేక ఎవరైనా పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. పైగా ఫిర్యాదు దారు వివరాలను కోడెల కుటుంబానికి చేరవేసేవారు పోలీసులు. దాంతో ఫిర్యాదు చేయాలని అనుకున్నవారిని పట్టుకుని కుటుంబసభ్యుల మద్దతుదారులు చావ గొట్టేవారు. ఆ విధంగా పై రెండు నియోజకవర్గాల్లో కోడెల కుటుంబంపై జనాల్లో అసహ్యం పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం మారగనే వాళ్ళ అరాచకాలు బయటకు వస్తున్నాయి.