వైసీపీ సలహాదారులకి ముందు చూపు కొరవడిందా?

అత్యుత్సాహమో లేక అనుభవ రాహిత్యమో ఏమో గాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఏడెనిమిది నెలల పరిపాలన రహదారిలో పయనంలా కాకుండా కీకారణ్యంలో ముళ్ల పొదలల్లో పయనించినట్లుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు రాజధానుల ప్రతిపాదన కూడా ప్రస్తుతం త్రిశంకుస్వర్గం చేరింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ కొమ్ములు తిరిగిన పలువురు సలహా దారులున్నారు. అయినా ఈ పరిస్థితి ఎదురౌతుందని ఊహించలేక పోయారంటే నమ్మ శక్యం కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అతి సామాన్యులు కూడా శాసన మండలిలో చర్చ జరిగిన రోజు టిడిపికి మెజారిటీ వుందని ఫలితాలను ముందుగానే ఊహించారు.

ఇప్పుడే కాదు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ మద్దెల దరువు కొన సాగుతోంది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి వెల్లువెత్తిందని ప్రత్యేక కమిటీ వేసి నిగ్గుతేల్చారు. తీరా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ప్రకారమే చెల్లింపులు జరిగాయని చట్ట సభలో ప్రకటించి ప్రభుత్వ పరువు తీసింది. అదే విధంగా విద్యుత్ కొను గోళ్లలో అవినీతి అక్రమాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున హడావుడి చేసింది. తీరా కేంద్ర ప్రభుత్వం అలాంటిదేమీ లేదని ఒప్పందాలు రద్దు చేసితే మున్ముందు పెట్టుబడులు రావని అడ్డం తిరిగింది. టిడిపి పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు చేయ లేక పోయింది. ఎవరో ఏదో మాట్లాడారని నినాదాలు చేశారని మాత్రం పలు కేసులు నమోదు చేశారు. ఇది టిడిపి నేతలకు మరింత ఊపు లభించి తప్పులు జరిగి వుంటే కేసులు పెట్టండని సవాల్ చేస్తున్నారు.

తుదకు హైకోర్టు కూడా వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి నిలిపి వేసిన పాత బకాయిలు విద్యుత్ సంస్థలకు వెంటనే చెల్లించాలని ఆదేశించింది.పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టే అంశంలో శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం చవి చూచిన అనుభవం ఏమైందో తెలియదు. హైకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఏడెనిమిది నెలల కాలంలో హైకోర్టులో పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం దోషిగా నిలబడ వలసి వచ్చింది.

ఏ పార్టీ అయినా కొత్తగా అధికారంలోనికి వచ్చినపుడు దాని ప్రాధాన్యతలు విధిగా వుంటాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ. తప్పు కాదు కూడా. అయితే అవి అమలు జరిపే సందర్భంలో న్యాయ పరమైన అంశాలతో పాటు భౌతిక పరిస్థితులు విధిగా పరిగణనలోనికి తీసుకోవాలి. ప్రధానంగా ప్రజాభిప్రాయం పరిగణన అవసరం. కాని ఎందుకో గాని వైసిపి ప్రభుత్వంలో అది కొర వడింది. ఉదాహరణకు అన్న క్యాంటీన్లు. టిడిపి హయాంలో లక్షలాది మంది ప్రధానంగా అసంఘటిత భవన రిక్షా కార్మికులను ఈ పథకం ఎంతో ఆదుకొన్నది. ప్రభుత్వం మార్పు చెందగానే ఈ పథకానికి ఫుల్ స్తాప్ పెట్టారు. వాస్తవంలో అన్న క్యాంటీన్లు ద్వారా లబ్ధి పొందిన వారంతా చంద్రబాబు నాయుడుకు ఓటు వేసి వుంటే వైసిపికి శాసన సభలో 151 స్తానాలు లభించేవి కావు. కాకుంటే వైయస్సార్ క్యాంటీన్లు అని నిర్వహించి వుంటే మైలేజి వచ్చేది. అదే విధంగా రైతు రుణ మాఫీ. ఈ లబ్ది పొందిన వారంతా టిడిపికి ఓటు వేశారని భావించ లేము. రైతు బరోసా ద్వారా ఎంత మంది రైతుల మనసు గెలుచు కున్నారో రైతు రుణ మాఫీ రైతుల నుండి ఇంచుమించు వ్యతిరేకత తెచ్చుకున్నారు.

అదే విధంగా అమరావతి రాజధాని రైతులందరూ తెలుగు దేశం కు ఓటు వేసి వుంటే మంగళ గిరి తాడి కొండ నియోజకవర్గాల్లోనే కాకుండా కృష్ణ గుంటూరు జిల్లాలో వైసిపి అభ్యర్థులు గెలు పొందే వారు కారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తున్నదేమేనని పిస్తోంది.అంతెందుకు? శాసన మండలిలో టిడిపికి అత్యధిక స్థాయిలో మెజారిటీ వుందని అందరికి తెలుసు. అయినా అంత మూర్ఖంగా వ్యవహరించారంటే రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని వారు ఆశ్చర్య పోతున్నారు. ముందుగా పథకం ప్రకారం తెలుగు దేశం పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు మనోధైర్యం దెబ్బ తీసి రాజధాని మార్పుకు ఉపక్రమించి వుంటే వైసిపి ప్రభుత్వానికి ఈ దుస్థితి ఎదురయ్యేది కాదు.అమరావతి లాంటి భారీ పథకం అమలు జరిగిందంటే ఎక్కడా తప్పులు సంభవించవని చెప్ప లేము. తొలి నుండి కూడా ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని వైసిపి ప్రభుత్వం చెబుతోంది. వాస్తవంలో ఏం జరిగిందో పక్కన బెడితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను ప్రచార అస్త్రంగా మిగుల్చుకొంది. తప్ప భూకుంభ కోణానికి పాల్పడిన వారిని కోర్టు మెట్లెక్కించ లేక పోయింది. చట్టాల చట్రంలో బంధించ లేక పోయింది. దీనితో టిడిపి నేతలు మరింత ఆత్మ విశ్వాసంతో చెలరేగి పోయి శాసన మండలిలో ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఇందులో మరో కోణం వుంది. రాష్ట్రంలో వున్న అన్ని ప్రతి పక్షాలను ఈ అంశంపై ఏకం చేసింది. కనీసం కేంద్రంలో అధికారంలో వున్న బిజెపిని కూడా దూరం చేసుకోవడం కొస మెరుపు. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు. వెనక్కి రాలేదు. మూడు రాజధానుల ప్రతిపాదన త్రిశంకుస్వర్గంలో వుంది.దీని పరిణామమేమంటే మండలిని రద్దు చేయడం. రాజధానిని మార్పుచేసే సర్వాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వున్నట్లే మండలిని రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పార్లమెంటులో ఆమోదించితే దానికి నూకలు చెల్లినట్లే. కాని ఇదంతా వెనువెంటనే జరగడం కుదరక పోవచ్చు. మూడు రాజధానుల ఏర్పాటు మరి కొంత సమయం పడుతుంది.

వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు 9848394013