మద్యపానానికి ఎక్కువగా అలవాటు పడినవారికి ఏదైనా పని చెబితే… ‘లోపల మందు పడనిదే బండి నడవదు మామా’ అని అంటుంటారు! ‘చుక్కేస్తే పనులన్నీ చకచకా చక్కబెట్టేస్తాను’ అని చెబుతుంటారు. ఆ మనిషి బండి సంగతి కాసేపు పక్కనపెడితే… మనిషి నడిపే బైక్, కార్ వంటి వాహనాలకు ఇకపై ఇంధనంగా ఆల్కహాల్ ను వాడనున్నారు. అది ఎక్కడో కాదు.. మన భారతదేశంలోనే! అవునా… అంటరా… ఆ కథాకమీషేమిటో చూద్దామ్ పదండి!
సాధారణంగా భారతదేశంలోని చాలా పంపులలో ఇప్పుడు ప్రామాణిక ఇంధనం ఈ20. అంటే… 20% ఇథనాల్, 80% పెట్రోల్ ఉంటుంది! ఇదే క్రమంలో… బ్రాందీలో 40% ఇథనాల్ ఉంటుంది. అంటే ప్రతి 100 ఎంఎల్ లిక్విడ్ లో 40 ఎంఎల్ స్వచ్ఛమైన ఇథనాల్ ఉంటుందన్నమాట. అలాగే మిగిలిన విస్కీ, బీర్ మొదలైన వాటిలోనూ ఇథనాల్ ఉంటుంది! అయితే… అంతకు మించి అన్నట్లుగా ఇప్పుడు ఈ85 కోసం ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను జారీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అవును… పెట్రోల్ లో 20% ఇథనాల్ ఉండే ఏ20కి స్వస్తి చెప్పబోతున్నామని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో… భారతదేశంలోని బైకులు, కార్లు త్వరలోనే ప్రధానంగా ఆల్కహాల్ తో కూడిన ఇంధనంతో నడవవచ్చు. అంటే… సుమారు 85% వరకు ఇథనాల్, 15% పెట్రోల్ మిశ్రమంతో కూడిన ఏ85 కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పలు జాతీయ మీడియా సంస్థలు ఈ మేరకు కథనాలు ప్రచురిస్తున్నాయి.
ఈ సందర్భంగా… ఇథనాల్ 85 అంటే ఈ85 విడుదలపై ప్రభుత్వం వీలైనంత త్వరగా ముసాయిదా నిబంధనలను జారీ చేస్తుందని.. ఆ నిబంధనలు త్వరలో నోటిఫై చేయబడతాయని.. ఈ విషయంలో ప్రభుత్వంలో ఏకాభిప్రాయం ఉందని.. అదేవిధంగా మార్కెట్ ఏకాభిప్రాయం కూడా ఉందని.. ఈ క్రమంలో ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు కూడా నిర్వహించబడ్డాయని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి వెల్లడించినట్లు కథనాలొస్తున్నాయి.
వాస్తవానికి 2026 ఏప్రిల్ 1 నుండి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ20 పెట్రోల్ అమ్మకాలు తప్పనిసరి అయ్యాయి. ప్రధానంగా… ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యల వల్ల తలెత్తిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఎందుకంటే… భారత్ తన చమురు అవసరాలలో సుమారు 90% దిగుమతి చేసుకుంటుంది. ఈ పరిణామల నేపథ్యంలోనే… చెరకు, మొక్కజొన్న లేదా ధాన్యాల నుండి దేశీయంగా ఉత్పత్తి చేయబడిన ఇథనాల్ స్వచ్ఛమైన పెట్రోల్ కంటే శుభ్రంగా మండుతుందని అంటున్నారు.
అయితే… ఇప్పటికే ఉన్న ప్రామాణిక పెట్రోల్ ఇంజిన్లు ఇంత అధిక ఆల్కహాల్ శాతాన్ని తట్టుకునేలా రూపొందించబడలేదు కాబట్టి.. ‘ఈ85’ కోసం కొత్త ఇంజన్లను తయారు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఫ్లెక్స్ ఫ్యూయల్ కాని వాహనానాల్లో ఈ85ను ఉపయోగించడం వల్ల తుప్పు పట్టడం, ఇంటర్నల్ పార్ట్స్ దెబ్బతినడం, పనితీరు క్షీణించడం, స్టార్టింగ్ ట్రబుల్ వంటివి తలెత్తవచ్చని అంటున్నారు. అందుకే… ప్రత్యేకంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలుగా రూపొందించబడిన వాహనాలు మాత్రమే ఏ85ను ఉపయోగించాలి.
వాస్తవానికి ఈ ఆలోచన ఎప్పుడో మొదలైంది. ఇందులో భాగంగా… కేంద్ర ప్రభుత్వం సుమారు దశాబ్ద కాలంగా అధిక ఇథనాల్ మిశ్రమాల గురించి మాట్లాడుతూ వస్తోంది. ఈ క్రమంలో… దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ కోసం నీతి ఆయోగ్ 2020-25 రోడ్ మ్యాప్ 2021లో ఈ85ని స్పష్టంగా పేర్కొంది. టూవీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ వాహనాల కోసం ఈ85 వినియోగంపై తీవ్ర చర్చలే జరిగాయి!
ఈ సందర్భంగా స్పందించిన అధికారులు… దేశంలో ఇప్పుడు అదనపు ఇథనాల్ అందుబాటులో ఉందని.. ఈ అదనపు నిల్వలు, రోడ్డు రవాణాకు ఉన్న డిమాండ్ ను తీరుస్తాయని చెబుతున్నారు. ఇలా అధిక ఇథనాల్ మిశ్రమాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా… ముడి చమురు దిగుమతులు తగ్గడం, వాయు కాలుష్యం తగ్గడంతో పాటు ఇథనాల్ ఫీడ్ స్టాక్ ను పండించే రైతులకు మద్దతు లభించనుందని అంటున్నారు.
అలా అని అన్నీ ప్రయోజనాలే కాదు.. ఓ కీలక సవాల్ కూడా ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా… ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు కొద్దిగా తక్కువ మైలేజ్ అందించవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా… ప్రతీ విషయంలోనూ మంచీ, చేడూ.. కష్టం, సుఖం కామనే అని సరిపెట్టుకుంటే… ఈ ఆల్కహాల్ తో నడిచే వాహనాలు మాత్రం వీలైనంత త్వరగా మార్కెట్ లోకి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు పరిశీలకులు.
