తిరుమల వెంకన్న సొమ్ములు భద్రమేనా?

ఆర్థిక సంక్షోభంల చిక్కుకుపోయిన యస్ బ్యాంక్‌ నుంచి టిటిడికి చెందిన రూ.1300 కోట్ల‌ డిపాజిట్లను కొద్ది నెలల క్రితమే ఉపసంహరించుకు‌న్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. యస్ బ్యాంక్ బోర్డును రద్దు చేస్తూ.. నెలకు రూ.50,000 మించి నగదు ఉపసంహరణకు అవకాశం లేకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో టిటిడి తన డిపాజిట్లను వెనక్కి తీసేసుకుని పెద్ద గండం నుంచి బయటపడిందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

అయితే అసలు యస్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లో టిడిపి డిపాజిట్లు ఇంత కాలం ఎందుకు కొనసాగించారు? అన్నది ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. టిటిడి అకౌంట్స్ విభాగం అతి పెద్దది. ఫైనాన్స్ రంగంలో అనుభవం ఉన్న పెద్దలే ఇందులో ఉన్నారు. బాలాజీ ఎఫ్ అండ్ సిఏఓగా ఉన్నారు. మరి అలాంటి వాళ్లంతా ఇలా ప్రయివేటు బ్యాంకుల్లో డిపాజిట్లకు ఎందుకు మొగ్గుచూపారన్నది ప్రశ్నార్థం. ఏదైనా ప్రయివేటు బ్యాంకుల్లో టిటిడి సొమ్మును డిపాజిట్ చేసేప్పుడు ఆ బ్యాంకుల స్థితి గతులు, ఆ సమయంలో బ్యాంకుల పరిస్థితిపై అధ్యయనం చేయకుండానే ఇలాంటివి చేస్తున్నారా?

యస్ బ్యాంక్ ఉదంతం వెలుగు చూసింది.. కాబట్టి ఇది బైట పడింది. మరి అంతకు ముందే డిపాజిట్లు వెనక్కి తీశారు కాబట్టి సరిపోయింది. లేదంటే రూ. 1300 కోట్లు మునిగిపోయేవి కదా? అసలు ప్రైవేటు బ్యాంకుల్లో టిటిడి డిపాజిట్లపై మొదటి నుంచి ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఈ డిపాజిట్ల వె‌నుక భారీగా ముడుపులు చేతులు మారుతున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పటికైనా టిటిడికి చెందిన రూ.12 వేల కోట్ల డిపాజిట్ల పరిస్థితిని సమీక్షించి, వాటిపై విచారణ చేయిస్తే బాగుంటుందని డిమాండ్ కూడా వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా టిటిడి ఇతర ప్రయివేటు బ్యాంకుల పరిస్థితి కూడా చూసి స్వామి వారి ధనాన్ని భద్రతపై ఓ క్లారిటీ ఇస్తే భక్తులు సంతోషపడతారు.