టీడీపీని వీడిన బాలకృష్ణ సన్నిహితుడు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార వైసీపీలోకి భారీగా చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన నేతలు రహమాన్.. డొక్కా వైసీకీ కండువా కప్పుకోగా.. కడప జిల్లాకు చెందిన మరి కొందరు నేతలు కూడా వైసీపీలో చేరేందుకు క్యూ కట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. 

తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే, బాలకృష్ణ సన్నిహితుడు కదిరి బాబురావు కూడా తెలుగు దేశంను వీడి వైసీపీలో చేరనుండటం చర్చనీయాంశంగా మారింది. ఎంతో కాలంగా పార్టీని మారాలని బాబురావు భావించినా బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని ఆగిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరిస్థితి చూసిన తరువాత ఇక కార్యకర్తల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీని వీడాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని బాలకృష్ణ దృష్టికి కూడా తీసుకెళ్లిన తర్వాతే బాబు రావు ఈ నిర్ణయం తీసుకున్నాడనే విషయమే ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. దశాబ్జాలుగా వైఎస్ కుటుంబంతో పోరాడుతున్నా సరే తనపై చంద్రబాబుకు నమ్మకం లేదని సతీష్ రెడ్డి పేర్కొనడం చూస్తుంటే.. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది, బలమైన నేతలు కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నా చంద్రబాబు పట్టనట్లు ఎందుకు ఉంటున్నారు అనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. మరి అధినేత చంద్రబాబు ఇలానే సైలెంట్‌గా ఉంటే అన్ని జిల్లాల్లో పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం కొసమెరుపు.