ఉమ్మడి ప్రాజెక్టులైన సాగర్ శ్రీ శైలం జలాశయాల్తో తెలంగాణతో నిమిత్తం లేకుండా గోదావరి జలాలు తరలింపు సాధ్యమా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా సూచించి నట్లు గోదావరి జలాలను సాగర్ శ్రీ శైలం జలాశయాలకు తరలించే ప్రతి పాదన తెర మీద కొచ్చింది . సాగర్ నిర్వహణ తెలంగాణ చేతిలో వుండటం పైగా సాగర్ శ్రీ శైలం జలాశయాల జలాలు రెండు రాష్ట్రాలు వినియోగించు కోవడమే కాకుండా పంపిణీ బాధ్యత బోర్డుకు వుండటం ఇవన్నీ చిక్కులతో కూడినవే.ఈ అంశాలు ముఖ్యమంత్రికి అధికారులు నివేదించి నట్లు లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రెక్కలు కట్టుకుని ఆంధ్రప్రదేశ్ వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అన్ని సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకొందామని ప్రకటించారు. అందులో భాగంగా గోదావరి కృష్ణ నదుల అనుసంధానం రెంఢు రాష్ట్రాలు సంయుక్తంగా చేపట్టాలని నొక్కి చెప్పారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలంగాణతో కలసి గోదావరి కృష్ణ నదుల అనుసంధానం తప్ప ఆంధ్ర ప్రదేశ్ కు మరో మార్గం లేదని తుదకు శాసన సభలో కూడా ఉద్ఘాటించారు. తదుపరి ముఖ్యమంత్రులు ఇరువురు పలుమార్లు సమావేశమయ్యారు. అదే సమయంలో రెండు రాష్ట్రాల ఇంజనీర్లు ఎవరికి వారు పథకాలు తయారు చేసి సంయుక్తంగా కూడా ఒకరి ప్రతి పాదనలు మరొకరు పంచుకున్నారు.
ప్రధానంగా గోదావరి నది రాంపూర్ వద్ద నుండి పలు ఎత్తిపోతలతో అటు సాగర్ కు ఇటు శ్రీ శైలంకు గోదావరి జలాలు తరలించాలని తెలంగాణ ఇంజనీర్లు రూపొందించిన పథకం ప్రముఖంగా తెర మీదకు వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ఇంజనీర్ల పథకాలు పెద్దగా ప్రచారంలోనికి రాలేదు.ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పార్టీలే కాకుండా వివిధ రైతు సంఘాల నేతలు గోదావరి కృష్ణ నదుల అనుసంధానం తెలంగాణతో కలసి చేపట్టడం ఉచితంగాదని వ్యతిరేకత వ్యక్తం చేశారు. తెలంగాణ భూభాగం నుండి కాలువ సుదూరం రావడం పైగా గేట్లు ఆపరేషన్ తెలంగాణ అధీనంలో వుండటం వీటన్నింటికీ మించి ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే చెంద వలసిన గోదావరి మిగులు జలాలు తెలంగాణకు పంచడ మౌతుందనే సమస్యలు ప్రముఖగా విన్పించాయి. అదే సమయంలో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు సమావేశం నిర్వహించి తెలంగాణ భూభాగంలో కాలువ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు గోదావరి జలాలు ఇవ్వడం సముచితం కాదని ముఖ్యమంత్రి కెసిఆర్ కు నివేదిక ఇచ్చినట్లు తర్వాత ఆయన తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలంగాణ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇదిలా వుండగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా విశ్రాంత ఇంజనీర్ల అసోసియేషన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాసి తెలంగాణతో కలసి అనుసంధానం పథకం అమలు చేయడం మంచిది కాదని రాష్ట్రంలోనే అంతర్గత అనుసంధానం సముచితమని ప్రత్యామ్నాయ పథకం సూచించారు. మన విశ్రాంత ఇంజనీర్ల లేఖ ప్రభావం కావచ్చు లేదా ముఖ్యమంత్రి తను స్వతహాగా నిర్ణయం తీసుకున్నారో తెలియదుగాని పూర్తిగా యూ టర్న్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని రాజకీయ పార్టీలే కాకుండా రైతు సంఘాల నేతలు స్వాగతించారు. గోదావరి కృష్ణ అనుసంధానం కాకుండా గోదావరి పెన్నా అనుసంధానం తెర మీద కు వచ్చింది. పోలవరం నుండి వచ్చే గోదావరి జలాలు కృష్ణ నదిపై నిర్మించే అక్విడెక్టు ద్వారా వచ్చి సాగర్ కుడి కాలువలో కలపడం అదే సమయంలో బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణం మరొక కాలువ ద్వారా వెలుగొండ దాటు కొంటూ తుదకు కర్నూలు జిల్లా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద అంతం కావడం ప్రతిపాదనలతో చర్చలు జరిగాయి ఇందుకు 65 వేల కోట్లు వ్యయమౌతుందని కేంద్ర జల సంఘానికి చెందిన వ్యాస్కోప్ సంస్థకు డిపిఆర్ తయారు చేసే బాధ్యత అప్పగించినట్లు వార్తలు వెలువడ్డాయి..
తర్వాత ఏమైందో ఏమో గాని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాకుండా ఇంజనీర్ల బృందాలు కూడా సమావేశాలు నిర్వహించ లేదు. అంటే నదుల అనుసంధానం ఎవరికి వారు చేపడతారనే భావన రెండు రాష్ట్రాల ప్రజల్లో ఏర్పడింది. ఈ పూర్వ రంగంలో ఉరుములు లేకుండా పిడుగులు పడినట్లు గోదావరి జలాలు తరలింపు విధానం మార్పుచేస్తూ సరికొత్త ప్రతి పాదనలు తెర మీదకు వచ్చాయి. గోదావరి జలాలు తొలుత పులిచింతలకు తరలించి అక్కడ నుండి సాగర్ శ్రీ శైలం జలాశయాలకు రివర్స్ పంపింగ్ చేసేందుకు వున్న అవకాశాలు పరిశీలించాలని తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో గోదావరి జలాలు తరలించడంపై పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారని వార్తలు వచ్చాయి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ అనుసరించిన విధానం అమలుకు సిద్ధమవుతున్నారు. గోదావరి నది పూర్తిగా తెలంగాణ భూభాగంలో వున్నందున ఇబ్బందులు తలెత్త లేదు. కాని కృష్ణ నది ఆలా కాదు.
ముఖ్యమంత్రి సూచించినట్లు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో గోదావరి జలాలు తరలించడం పైగా భూసేకరణ సమస్య లేకుండా పోవడం భేషుగ్గా వున్నా ఇందులో కీలక మైన చిక్కు ముడి వుంది. సాగర్ శ్రీ శైలం జలాశయాలు ఉమ్మడి ప్రాజెక్టులు. అది కాకుండా శ్రీ శైలం సాగర్ జలాశయాల నీటి పంపిణీ బాధ్యత కృష్ణ నది యాజమాన్య బోర్డు అధీనంలో వుంటుంది. అలాంటప్పుడు గోదావరి జలాలు మనం సాగర్ శ్రీ శైలం తరలించితే నీటి పంపిణీలో రెండు రాష్ట్రాల మధ్య తగాదా ఏర్పడే అవకాశం లేక పోలేదు. ఈ అంశాన్ని మన ఇంజనీర్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారో లేదో తెలియదు. వాస్తవంలో పోలవరం ప్రాజెక్టు రూపకల్పన చేసినపుడు కుడి కాలువతో పాటు పులిచింతలకు ఒక కాలువ ప్రతి పాదించ బడింది. ఆ ప్రతిపాదన ఆచరణకు రావచ్చు. గాని తెలంగాణతో నిమిత్తం లేకుండా ఈ విధానంతో గోదావరి జలాలు తరలించ డం సాధ్యమా? లేదా తెలంగాణతో కలసి గోదావరి జలాలను ఉపయోగించుకొనే ఆలోచన ఏమైనా వుందా?
వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013
