క్షేత్రస్థాయిలో అంతా రివర్స్! వైసిపి నేతల్లో భయాందోళనలు!

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవ రత్నాలు లాభం కన్నా అపకారం ఎక్కువగా జరుగుతోందని క్షేత్రస్థాయిలో వైసిపి నేతలు మథన పడుతున్నారు. ఫించన్లు రేషన్ కార్డులు రద్దు బల వంతపు భూసేకరణ మున్ముందు తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుందని భయ పడుతున్నారు. కాని ఒక్కరూ నోరు విప్పే స్థితిలో లేరు. ముఖ్యమంత్రి చెప్పిందే వేదంగా సాగుతుంటే మంత్రులు కూడా నోరు విప్పలేదంటే ఇక తాము చేయ గలిగిందేమీ లేదని ఎమ్మెల్యేలు సమాధాన పడుతున్నట్లు ప్రచారంలో వుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముందు పెట్టుకొని ఏక బిగిన దాదాపు ఆరేడు లక్షల ఫించన్లు రద్దు చేయడం ఇరవై లక్షల రేషన్ కార్డులు రద్దు కావడం వైసిపి నేతలకు మింగుడు పడటం లేదు.  టిడిపి నేతలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫించన్లు రేషన్ కార్డులు రద్దు బాగా ఉపయోగ పడుతుందనే మహదానందంలో వున్నారు. మగ్గాలు ఆటోలు స్వంతంగా గల వారికే ఆర్థిక సాయం అందింది. వారితో పోల్చుకుంటే అద్దెకు పని చేసే వారు ఎన్నో రెట్లు అధికంగా వున్నారు. ప్రస్తుతం వారంతా గుర్రుగా వున్నారు.

ఫించన్లు అంశానికొస్తే మరీ మెట్ట ప్రాంతాల్లో పది ఎకరాలుగల రైతు కుటుంబం ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా వుంటుంది. కుటుంబం లోని వారు కూలీ పనులకు పోతే గాని కుటుంబ పోషణ కష్టంగా వుంటుంది. కొన్ని కుటుంబాల్లో పల్లం పొలం మూడు ఎకరాలు వున్నా సాగునీటి వసతి లేనపుడు లేదా బోరు బావిలో నీరు లేనపుడు లేదా చెరువు మరమ్మతులు లేకుండా నీరు నిల్వ లేనపుడు మూడు ఎకరాల భూమి ఎందుకూ పనికి రాదు. ఈలాంటి కుటుంబాలకు చెందిన ముదుసులకు ఫించన్లు కోత పెట్టారు. రేషన్ కార్డులు రద్దు చేశారు . పైగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేక పోవడం సాధ్యమైనంత వరకు అనర్హత కింద సంఖ్య బాగా తగ్గించాలనే ఆదేశాలు వుండటం కూడా ఇందుకు తోడైంది

టిడిపి హయాంలో జన్మ భూమి కమిటీల్లాగా వాలంటీర్ల వ్యవస్థ ప్రస్తుతం స్థానిక వైసిపి నేతల చేతుల్లో వుండటంతో టిడిపి సానుభూతి పరులు అనే దాని కన్నా మొన్నటి ఎన్నికల్లో వైసిపికి వ్యతిరేకంగా పని చేసిన కుటుంబాలకు చెంది ఏ చిన్న మైనస్ పాయింట్ వున్నా కోత పెట్టారు. దీనికి తోడు మరో అంశం వుంది. . కుటుంబం ఆర్థికంగా పదిలంగా వున్నా ముసలి తలిదండ్రులను కుమారులు సరిగా చూచుకోక పోవడం సర్వసాధారణంగా వుంది. అయితే ఇంతవరకు ఆ ఇంటికి చెందిన ముసలి వాళ్లకు ఫించన్ వచ్చేది. ఫించన్లు కోసం ముసలి వాళ్లకు అంతో ఇంతో దాహం పోసే వారు. ప్రస్తుతం ఈలాంటి చాల మందికి ఫించన్లు రద్దు చేశారు. ఇప్పటికే కొంత మందిని ఇళ్ల నుండి వెళ్ల గొట్టారు. గ్రామాల్లో ఫించన్లు తొలగించిన వారి గోడు వర్ణనాతీతంగా వుండటమేగాక నమ్మి మోసపోయి ఓటు వేశామనే రోదన భాషకు అందకుండా వుంది. టిడిపి హయాంలో ఇంత ఖచ్చితంగా చూడ లేదని అటు ఇటుగా వెసులుబాటు వుండేదని ప్రస్తుతం రూల్ల కర్ర పెట్టి కొలుస్తున్నట్లు చేయడంతో ఒకటి ఇచ్చి రెండు లాగుకున్న చందంగా వుందని ఎక్కువ మంది భావిస్తున్నారు.

అయితే టిడిపి నేతలు ఒక పక్క ఫించన్లు కోత పెట్టిన వారికి సానుభూతి తెలుపుతూ లోలోన ఆనంద పడుతున్నారు. ప్రస్తుతం మరో ధోరణి కనిపిస్తోంది. నియోజకవర్గాల స్థాయిలోనే కాకుండా మండల సచివాలయ లెవల్ లో కూడా మునుపటి లాగా ప్రతి పక్ష ప్రతినిధులను దగ్గరకు రానీయడం లేదు. వైసిపి నేతలు చెబితే తప్ప పనులు జరగడం లేదు. ఈ పరిస్థితి ప్రజలు కూడా అర్థం చేసుకొని అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగు తున్నారు. ఈ పరిస్థితి మున్ముందు వైసిపి కి తీవ్ర ప్రతిబంధకం కావచ్చు. అధికార యంత్రాంగం మొత్తంగా వైసిపి నేతల చేతుల్లోకి పోయింది