ఎన్ని అవమానాలు ఎదురైనా ఆంధ్రా రుణం తీర్చుకుంటున్న వెంకయ్య

రైతుల నుంచి సేకరణ, చెల్లింపుల కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో రాష్ట్రానికి కేంద్రం నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ కోసం ఎఫ్‌సీఐకి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రూ. 2498.89 కోట్లు విడుదల చేసింది. ఏపీలో ధాన్యం సేకరణ, చెల్లింపులపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన వెంకయ్య కేంద్ర మంత్రులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. 

సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా వెంకయ్య పై విమర్శలు చేస్తున్నా.. రాష్ట్ర మంత్రులు లేఖల ద్వారా వెంకయ్యను ఇరుకున పెట్టాలని చూసినా.. ఆయన మాత్రం ఢిల్లీలో తన పరపతిని రాష్ట్రం కోసం వాడుతూనే వున్నారు.

ఆంధ్రాపై పక్షపాతం చూపుతున్నారని వెంకయ్యనాయుడుని ప్రధాని మోడీ మంత్రివర్గం నుంచి తప్పించి ఉపరాష్ట్రపతిని చేశారు. అయినా వెంకయ్య మాత్రం రాష్ట్రం కోసం పరితపిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఉన్నా సరే ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆంధ్రా రైతుకు బకాయిల చెల్లింపులు వెంటనే చేయాలని ఆధికారులకు సూచించిన ఆయన అనుకున్నట్లే కేంద్రం నుండి నిధులు విడుదలయ్యేలా చేశారు. తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ఆయన మాత్రం చేతనైనది చేయాలనే ప్రయత్నిస్తున్నారు.