అమరావతిలోనే రాజధాని వుండాలనా? లేక మూడు రాజధానుల ప్రతి పాదన రాష్ట్రాభి వృద్ధికి తోడ్పడు తుందా? అనే అంశాలు పక్కన బెడితే కొన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై పలు యూ టర్న్ లు తీసుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా వుంది. తొలి నుండి బిజెపిలో ఏకాభిప్రాయం లేదు. కన్నా లక్ష్మీనారాయణ ఒక ప్రకటన చేస్తే రాజ్యసభ సభ్యులు నరసింహారావు పాటు సోము వీర్రాజు మరొక రకంగా మాట్లాడే వారు. వీరి పరస్పర విరుద్ధ ప్రకటనలపై రాష్ట్ర ప్రజలు నవ్వు కొన్న సందర్భాలు లేక పోలేదు. ఎంతో క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకొనే బిజెపి కప్పల తక్కెడలా వ్యవహరిస్తోందని భావించిన వారు లేక పోలేదు. ఇదిలా వుండగా బిజెపి జనసేన మధ్య పొత్తు పొడిచిన తర్వాత మరింత అపహాస్యం పాలయ్యారు. ఈ పొత్తు పొడవక మునుపే పవన్ కళ్యాణ్ కవాతు ప్రకటించారు. తదుపరి ఇరు పార్టీలు కవాతు నిర్వహించుతారని ప్రకటించ బడింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. వారి మధ్య పొత్తు అయితే కుదిరింది. గాని అమరావతి అంశంలో యూ టర్న్ తీసుకున్నారు. తొలుత కవాతు వాయిదా వేశారు. తదుపరి వాళ్ల స్వరాల్లో మార్పులు వచ్చాయి.
అమరావతి నుండి రాజధాని కదిలించేందుకు వీలు లేదని ఎందాకైనా పోరాడు తామని ప్రకటనలు చేస్తుండిన ఇరు పార్టీల నేతలు గొంతు మార్చారు. పవన్ కళ్యాణ్ అయితే హద్దు పొద్దు లేకుండా మాట్లాడారు. రాజధాని ఎట్లాతరలించు తారో చూస్తానని సవాళ్లు చేశారు. ప్రస్తుతం మాట మార్చారు. అమరావతి రైతులకు న్యాయం చేస్తామని అందుకు పోరాడు తామని చెబుతున్నారు. అమరావతి నుండి రాజధానిని కదల్చకుండా సాగించే పోరాటం వేరు. రాజధాని రైతులకు న్యాయం చేయడం వేరు. అందుకే ఇరుపార్టీల నేతలు మౌనం పాటించారు. అంటే కేంద్ర ప్రభుత్వం రాజధాని తరలింపుకు అంగీకరించి వుండాలి. లేదా రాజధాని తరలింపు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోదనే సమాచారం ఇరు పార్టీల నేతలకు ఢిల్లీలో వంట బట్టి వుండాలి. అందుకే ఇటీవల ఇరు పార్టీల నేతలు రైతుల ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని రాజకీయ వర్గాల్లో గుస గుసలు సాగుతున్నాయి.
ఈ రోజు కూడా కన్నా లక్ష్మీనారాయణ రైతులకు అండగా వుంటామని చెప్పారు. గాని రాజధాని కదిలించే సమస్య లేదని ఖరాఖండిగా చెప్పలేదు. వాస్తవం చెప్పాలంటే బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఆ పార్టీ అనుకుంటే ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం ప్రకారమే తరలింపు వున్నా బిజెపి అధిష్టానం వర్గం అనుకుంటే ముఖ్యమంత్రి ఇంత సాహసం చేయ లేరు. కాని రాజధాని అంశంలో తొలుతనే రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం లేదు. అధిష్టానం అంత కన్నా నోరు విప్పదు. ఈ రోజు కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి కర్ర విరగకుండా పాము చావ కుండా ప్రకటన చేశారు. రాజధాని తరలింపు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి వుందని అయితే రైతులకు న్యాయం చేస్తామన్నారు. కొసమెరుపు గా రాజధాని తరలింపు అంశాన్ని రాష్ట్రం కేంద్రానికి తెలప లేదని సమాచారం అందిన తర్వాత చూద్దాం అని చెప్పారు.
బిజెపి వ్యవహార శైలి ఇలా వుంటే ఆదివారం వరకు పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు. పోలీసుల లాఠీ ఛార్జీలో గాయ పడిన వారిని ఓదార్చేందుకు పర్యటన పెట్టుకున్నారు. ఇప్పటి కిప్పుడు బిజెపి జనసేన పార్టీలు రెండు కూడా రైతులు సాగిస్తున్న ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాలు కన్పించడం లేదు. అంటే రైతులకు న్యాయం చేస్తామనే స్థితికి దిగ జారారని రాజకీయ వర్గాలు విశ్లేషించుతున్నాయి.
వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013
