స్థానిక సంస్థల నోటిఫికేషన్ ముందే జగన్ పైచేయి !

లాక్ డౌన్ విషయంలో జగన్ రిస్కు తీసుకుంటున్నారా?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ శనివారం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ రెండూ ఒకే రోజు విడుదల చేశారు. పరిషత్ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలన్నీ మార్చి నెలలోనే ముగించు నట్లు షెడ్యూల్ ప్రకటించారు. ఇది ఒక విధంగా ఆశ్చర్యమే. గతంలో ఎన్నడూ ఇలా జరిగిందిలేదు. ఒక్క నెలలో మూడు తరహా ఎన్నికలు జరగలేదు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బృందం పన్నిన పకడ్బందీ వ్యూహంలో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చిక్కుకున్నాయి. జనసేన బిజెపి స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటి చేయాలని గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నా అవి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అసలు ఎన్నికల ప్రచారానికే సమయం తక్కువ. ఈ రెండు పార్టీలు కూడబలుకుకొని సంయుక్తంగా పోటీకి సన్నాహాలు చేసే సమయం అంత కన్నా లేదు. మరో వైపు వామపక్ష పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలనే ప్రతిపాదన వుండగా మరో వైపు సిపిఐ నేతలు చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు. . ఇవి ఏవీ కార్యరూపం దాల్చే సమయం ఇవ్వకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనారు. ఆఖరున పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. తొలి దశలోనే అధికార వైకాపా ప్రతి పక్షాలను ఆత్మరక్షణలో పడేసింది.

రాష్ట్రంలో ప్రతి పక్షాలు చెల్లాచెదురుగా వున్నాయి. తట్ట బుట్ట సర్దుకొనే సమయం లేకుండా పోయింది. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పార్టీకి వెసులు బాటు వుంటుంది. ఎందుకంటే ఒక వేళ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను గెలిపించినా ప్రభుత్వం నిధులు విడుదల చేయక పోతే అంతా వృధా అనే భావన ఓటర్లలో వుంటుంది. పోటీ చేసే అభ్యర్థులకూ ఈ భయం వుంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత మరీ ఎక్కువగా వున్న సందర్భాల్లో తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అధికార గణం నుండి సహాయ నిరాకరణ వుండి తీరుతుంది. మరీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థఫై తీవ్ర ఆరోపణలు వున్నాయి. అదే సాధారణ ఎన్నికల్లో అయితే అధికార గణం ఎంతో కొంత జాగ్రత్త పడుతుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిపాలన పద్దతులు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంచాయత్ రాజ్ చట్టానికి తెచ్చిన సవరణలు రెండు వేపుల పదును వున్న కత్తిలాగా వున్నాయి. ఈ కత్తి ఎటువేపు నరుక్కూపోతుందో ప్రత్యేకంగా చెప్ప పనిలేదు. చంద్రబాబు నాయుడు చెప్పాడని కాదుగాని ఒక దఫా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ప్రభుత్వ ప్రమేయం ఏమీ వుండదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల కమిషన్ అధీనంలోనికి వెళుతుంది. కాని రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ఇదిలా వుండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతి పాదన చేసిన తర్వాత అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్రలో ప్రతి పక్షాల యెడల ఎంతో కొంత వ్యతిరేకతను ముఖ్యమంత్రి సృష్టించగలిగారు. ఇక నిన్న గాక మొన్న లభించిన విజయోత్సాహంతో పాటు అధికార పార్టీకి వుండే వెసులుబాటు వుండనే వుంది. ఇక కోస్తా జిల్లాల ప్రజల తీర్పు వేచి చూడాలి. ప్రస్తుతం ఎవరి వద్ద కొల బద్ద లేదు. ఇంకా చెప్పాలంటే గుంటూరు కృష్ణ జిల్లాల ప్రజల తీర్పు అమరావతి రాజధాని పోరాటంపై గణనీయమైన ప్రభావం కలిగించనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ముందే ముఖ్యమంత్రికి పైచేయి సంపాదించి పెట్టిన ఎత్తుగడలను ఎన్నికల సమయంలో భావోద్వేగంతో కూడినదిగా భావించే అమరావతి రాజధాని పోరాటం కనీసం కోస్తా జిల్లాల్లోనైనా ఎంత వరకు పని చేస్తుందో చూడాలి. అమరావతి రాజధానిగా వుండాలని 29 గ్రామాల రైతులే ప్రత్యక్ష పోరాటం సాగించుతూ వుండ వచ్చు. కాని హిందు పత్రికతో పాటు వైకాపా సోషల్ మీడియా నిర్వహించిన సర్వే ఫలితాలు మన ముందున్నాయి. అవి కనీసం కోస్తా జిల్లాల్లోనైనా ఎంత వరకు ప్రతి ఫలిస్తాయో చూడాలి. ఏదీ ఏమైనా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు నల్లేరు మీద నడకే కావచ్చు.