విశాఖ సంఘటన ద్వారా బాబు ఏమి చెప్పదలచుకున్నారు?

చంద్రబాబు నాయుడును విశాఖలో అడుగు పెట్టకుండా నిరోధించడంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించింది. విమానాశ్రయం వద్ద టిడిపి శ్రేణులను ఆత్మరక్షణలో పడేసింది. ఇందుకు పోలీసులు పూర్తి సహకారం ఇచ్చిన అంశం పక్కన బెడితే మట్టుకు వైసిపి అనుకున్నది సాధించింది. . అంతేకాదు, 2017 లో తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి జరిగిన అవమానం చంద్రబాబు నాయుడుకు చవి చూపించారు. ఈ అంశం అంతర్లీనంగా లేకుంటే అసలు పోలీసులు చంద్రబాబు నాయుడుకు తొలుతనే అనుమతి నిరాకరించేవారు. అంతా పథకం ప్రకారం కథ నడిపించి చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం చూపించారు. విశాఖ రాజధాని వద్దని చెప్పినందుకు ప్రజలే అడ్డుకున్నారని ప్రస్తుతం చెబుతున్నారు. కాని మంత్రి అవంతి ముందటి రోజు చేసిన ప్రకటన ఇంతలోనే ప్రజలు మరచి పోయారని భావించడం వారి వాదనలోని బలహీనతలకు నిదర్శనం. పోలీసు అధికారులు కూడా ఆఖరు వరకు ఆలస్యం చేసి ప్రదర్శనకు అనుమతి లేదని షరతులతో పర్యటనకు అనుమతి ఇచ్చారు.

రాష్ట్రంలో చాల మంది జరగబోయేది ముందుగానే ఊహించారు.చంద్రబాబు నాయుడును ఎయిర్ పోర్ట్ వరకు అనుమతి ఇచ్చి తిరిగి వెనక్కి పంపుతారనేది బహిరంగ రహస్యమే. అయితే గురువారం విశాఖ విమానాశ్రయంలో జరిగిన పరిణామాలు పైకి రాజకీయంగా వైసిపి పైచేయి సంపాదించినట్లు కన్పించినా విశాఖ ప్రజల దృష్టిలో వాస్తవంలో రాజకీయంగా నష్ట పోయిందని చెప్పాలి. వివిధ రాష్ట్రాల ప్రజల సమ్మేళనంగా ప్రశాంతతకు చిహ్నంగా వున్న విశాఖ ప్రజలు ఇలాంటి సంఘటనలు అభిలషించరు. ఏదైతే రాజధాని కానున్న నగరంలో జరగకూడదో గురువారం అదే జరిగింది.

అంతేకాదు. చంద్రబాబు నాయుడుతో పాటు టిడిపి నేతలకు కూడా జరుగనున్న పరిణామాలు ముందుగానే తెలుసునని చెబుతున్నారు. వైసిపి ఒక రకంగా నరుక్కు వస్తే తాము మరొక రకంగా రాజకీయంగా ఉపయోగించుకోనేందుకు టిడిపినేతలు సిద్దమైనారు. టిడిపిశ్రేణులు వున్నంతలో కూడా ప్రతిఘటన ఇవ్వక పోవడం పోలీసులు అరెస్టుకు సిద్దమైతే చట్ట బద్దంగా అరెస్టు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు తయారు కావడం వెనుక మరో వ్యూహం వుందని చెబుతున్నారు. న్యాయపరంగా పోలీసులను ఇరికించడమే కాకుండా వైసిపి నేతల రౌడియిజం విశాఖ ప్రజలకు “డెమో” ఇప్పించడం లక్ష్యంగా వుందంటున్నారు. గురువారం సాయంత్రానికి సోషల్ మీడియాలో ఈ లాంటి తరహా పోస్టింగ్ లు దర్శనమిచ్చాయి.

ఉత్తరాంధ్రలో పేదరికం వుండవచ్చు. వలస బతుకులు వుంటాయి. కాని తుదకు కోస్తా ప్రాంతంతో పోల్చుకున్నా కక్షలు కార్పణ్యాలు రచ్చలు దాడులు హత్యా రాజకీయాలు ఉత్తరాంధ్రలో మచ్చుకు కనిపించవు. పైగా ఇటీవల విశాఖ నగరం తీరే మారి పోయింది. కాస్మోపాలిటిన్ స్వరూపం తీసుకోగానే దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసముంటున్నారు. ఈ పరిస్థితిలో ప్రశాంతతకు మారు పేరుగా వున్న రాజధానిలో రౌడియిజం వేళ్లూనతోందని చంద్రబాబు నాయుడు పుంఖానుపుంఖగా ప్రచారం చేస్తున్నారు. దీన్నే చంద్రబాబు నాయుడు కూడా పథకం ప్రకారం డెమో ఇప్పించారనే ప్రచారముంది. ఈ నేపథ్యంలో పోలీసులు చంద్రబాబు నాయుడు యాత్రకు అనుమతి ఇచ్చికూడా ఒక మాజీ ముఖ్యమంత్రికి రక్షణ ఇవ్వలేక పోవడం అటుంచగా వైసిపి శ్రేణులు విమానాశ్రయం వద్ద సాగించిన దాడి కోడిగుడ్లు టొమాటోలు చెప్పులు వేయడం ప్రశాంతతకు మారు పేరైన విశాఖ ప్రజలు హర్షించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది

విశాఖ నగరం రౌడీ కోరల్లోని నెట్టడ మౌతోందని తను ఇన్నాళ్లూ సాగించిన ప్రచారం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా రుజువు చేశారని తను అవమాన పడినా వైసిపికి మాయని మచ్చ అంటించడంలో సఫలమైనారని అందుకే ముందటి రోజు చంద్రబాబు నాయుడును అడ్డుకోండని ప్రకటన చేసిన మంత్రి గురువారం సాయంత్రానికి జరిగిన సంఘటనలకు వైసిపికి సంబంధం లేదని ప్రకటన చేయ వలసి వచ్చిందంటున్నారు .అంతేకాదు, చంద్రబాబు నాయుడు అరెస్టుపై రాష్ట్రంలో ఇతర ప్రాంతాల కన్నా ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో టిడిపి శ్రేణులు నిరసన తెలపడం మరో విశేషం.