బాబు ఫ్యాన్స్ లో జగన్ ఫోబియా.. “పలుకు” రివర్స్ అయ్యింది!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ‘మావిగన్’ అనేది అత్యంత కీలకమైన అంశంగా మారిన సంగతి తెలిసిందే. అమరావతికి చట్టబద్ధత దక్కింది అనే కూటమి నేతల సంబరాల నడుమ జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ పైనా, దానివల్ల కలిగే ఎక్కువ ప్రయోజనాలపైనా, అమరావతి నిర్మాణంతో పోలిస్తే దానికి అయ్యే తక్కువ ఖర్చుపైనా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ పత్రికాధిపతి రాసిన కొన్ని “పలుకు”లను రివర్స్ లో చంద్రబాబు & కో కి అప్లై చేస్తున్నారు నెటిజన్లు!

‘మావిగన్’ పై ఇప్పటికే తీవ్రమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబుకు సన్నిహితులుగా, స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా ప్రచారంలో ఉన్న పత్రికాధిపతులతో పాటు మాజీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో భాగంగా… మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ తెరపైకి వచ్చారు. అమరావతి – మావిగన్ పై తమదైనశైలిలో చాలా మంది ఊహించినట్లుగా స్పందించారు.

మావిగన్ వ్యవహారంపై స్పందించిన ఏబీ వెంకటేశ్వరరావు… జ‌గ‌న్ మావిగన్ వ్యాఖ్యలతో పెట్టుబ‌డుదారులు అమ‌రావ‌తిలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి భ‌య‌ప‌డుతార‌ని.. ఈ తరహా హెచ్చరిక ఇప్పటికే పెట్టుబడిదారుల్లోకి వెళ్లిపోయిందని.. దాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు.

కాసేపు అదే నిజమని అనుకుంటే… మరి తనను చూసే అమరావతికి పెట్టుబడులు వస్తాయంటూ చెప్పుకునే చంద్ర‌బాబు మార్క్ బ్రాండ్ సంగ‌తేంటి? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

అంటే చంద్రబాబు తన గురించి తన బ్రాండ్ గురించి చెప్పుకున్నవి.. ఓ వర్గం మీడియా అచ్చేసినవి.. లోకేష్ లాంటి యువ నేతలు చెప్పుకొచ్చినవి అన్నీ అవాస్తవాలేనా..? అనే ప్రశ్నా ఉత్పన్నమవుతోంది.

ఎందుకంటే… “వైఎస్ జగన్ మళ్లీ వస్తే..?” అనే ప్రశ్నను ముందు పెట్టి… “ప్రస్తుతం ఉన్న చంద్రబాబు బ్రాండ్” ని బద్నాం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు ఏబీ వెంకటేశ్వర రావు అని అంటున్నారు కొంతమంది తమ్ముళ్లు!

చంద్రబాబు చెప్పారనో.. భజన బృందం వాయించిందనో.. బాకా ఛానళ్లు ఉదాయనో.. కర పత్రాలు అచ్చేశాయనో కాకుండా… లక్ష ఎకరాల్లో తాము, తమవారు కొన్న భూముల మధ్యనే అమరావతి రాజధాని ఉండాలని.. అందుకు ఎన్ని లక్షల కోట్ల ప్రజాధనం అయినా వృథా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పే మాటలకు.. పెట్టుబడి దారులైనా, సామాన్యులైనా విలువ ఇస్తారా..? ఆ మాటలను అసలు పరిగణలోకి తీసుకుంటారా..? అందుకేగా అమరావతికి పెట్టుబడులు రానిది..? ఆఖరికి హెరిటేజ్ సైతం తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నది..?

అంటే… చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తాడ‌నే న‌మ్మ‌కం, రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త వ‌చ్చింద‌నే ధీమా.. పెట్టుబడి దారుల్లో ఉంటే.. అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి వ‌చ్చిన ఇబ్బంది ఏంటి..?

వాస్తవం ఏమిటంటే… చంద్రబాబు మళ్లీ వస్తారా..? లేదా..? అనే సంగతి కాసేపు పక్కనపెడితే… అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌డం ద్వారా రైతులను మురిపించగలిగారు తప్ప పారిశ్రామిక‌వేత్త‌ల్లో విశ్వాసం క‌లిగించ‌లేక‌పోయారు!

ఈ వివరాలు సరిగ్గా చెప్పలేకో.. చంద్రబాబును, అమరావతి భవిష్యత్తును పారిశ్రామికవేత్తలు నమ్మడం లేదని అంగీకరించలేకో.. అమరావతి కంటే జగన్ తెరపైకి తెచ్చిన మావిగన్ కే ప్రజామద్ధతు రోజు రోజుకీ పెరుగుతుందన్న నిజాన్ని ఒప్పుకోలేకో.. పారిశ్రామికవేత్తలను జగన్ భయపెడుతున్నారంటూ ఏబీ వెంకటేశ్వర రావు చేసిన వ్యాఖ్యలను సెల్ఫ్ గోల్ అని ఒకరంటే.. ఆత్మవంచన అని మరికొందరు అంటున్నారు.

ఇక మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ సైతం ఈ మావిగన్ అంశంపై మైకుల ముందుకు వచ్చారు.. తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా… మావిగన్ భావన కింద తీసుకున్న చర్యలు ఆవేశపూరితమైనవని, రాష్ట్ర భవిష్యత్తుకు నష్టదాయకమైనవని మొదలు పెట్టిన జయప్రకాష్ నారాయణ… ఆ విధానాలను “తుగ్లక్” చర్యతో పోల్చడం గమనార్హం.

అక్కడితో ఆగని జేపీ… ఇది ఆంధ్రప్రదేశ్ ఆదాయానికి, రాజధాని అభివృద్ధికి నష్టం కలిగిస్తుందని విమర్శిస్తూ… రాజధానులను మార్చే ఈ విధానం రాష్ట్రానికి గణనీయమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.

దీంతో జేపీకి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు ఆయన తరహా మేధావులూ, నెటిజన్లు. ఇందులో భాగంగా… సుమారు లక్ష ఎకరాల్లో, రెండు మూడు పంటలు పండే ప్రాంతంలో, వర్షాకాలం వస్తే.. వచ్చే నీరు, తోడే నీరు అన్నట్లుగా ఉన్న భూముల్లో.. రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రానికి ఆర్థిక నష్టం వస్తుందా.. లేక, ఇప్పటికే పోర్టు, ఎయిర్ పోర్టు, రైల్వే జోన్, నేషనల్ హైవేలతో ప్రపంచానికి అద్భుతమైన కనెక్టివిటీ ఉన్న కారిడార్ ను రాజధానిగా అభివృద్ధి చేయడం వల్ల రాష్ట్రానికి ఆర్ధిక నష్టం వాటిల్లుతుందా..?

ఈ ప్రశ్నలకు సమాధానం జేపీ లాంటి మేధావులకు, మాజీ ఐఏఎస్ అధికారికి తెలియంది కాదు కదా..?

ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలను వదిలిపెట్టి… పంటలు పండే భూములను సేకరిస్తూ.. పైగా వాటిని రైతుల త్యాగాలుగా అభివర్ణిస్తూ.. వారిని త్రిశంకు స్వర్గంలో పెట్టి.. సుమారు లక్ష ఎకరాల్లో కొన్ని లక్షల కోట్లతో నవ నగరాలు నిర్మిస్తానని చెప్పడాన్ని మహ్మద్ బీన్ “తుగ్లక్” చర్య అంటారా..?.. లేక, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాలను కలుపుతూ, ఆ కారిడార్ మొత్తాన్ని రాజధానిగా ఆలోచించి, రెట్టింపు అభివృద్ధి దిశగా ఆలోచన చేయడాన్ని “తుగ్లక్” చర్య అంటారా..?

చరిత్ర పుస్తకాలు చదువుకున్న జేపీకి తెలియంది కాదు కదా? కాకపొతే ఈసారి కాకరకాయ కాస్త కీకరకాయ అయ్యిందని సరిపెట్టుకోవాలి..!

ఏది ఏమైనా… అటు మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు “బెదిరింపులు” అంటూ ఆందోళన వ్యక్తం చేసినా.. ఇటు మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ “తుగ్లక్” చర్యగా అభివర్ణించినా.. రేపు మరో ఐ.ఎఫ్.ఎస్. అధికారి ఇంకో రకంగా వివరించినా.. వారు చెప్పేది ఏమిటంటే… ఎంతకాలమైనా, ఎన్ని లక్షల కోట్లైనా, ఎంత మంది రైతులు చకోర పక్షిలా ఆకాశంవైపు చూసినా.. అమరావతే ముద్దు – మరో మాట వద్దు అన్నమాట!!

మరి గ్రాఫిక్స్ లకు రివ్యూలే తప్ప, ఆచరణాత్మక చర్యలతో వీరికి అవసరం లేదా..? సమాజం ఏమైపోయినా.. వీరి స్నేహాలు, వీరి శ్రేయోభిలాషులు, వారి వారి ఆర్థిక సామర్థ్యాలు, పెట్టుబడులకు లాభాల ఫలాలు మాత్రమే ముఖ్యమా..? అలాంటప్పుడు ఆయా పార్టీల కండువాలు కప్పేసుకుని “తందాన తాన” అంటే సరిపోతుందిగా..? మేధావులు, న్యూట్రల్ విశ్లేషణల మాటున ఈ ముసుగు మాటలేలా..?

జనాలు ఏమంటారు, ఏమనుకుంటున్నారు, ఏమి కోరుకుంటున్నారు అనేది ఈ ముసుగు మేధావులకు అవసరం లేదా..? ఆ జనాల్లోనూ ఓ వర్గం జనాల అభిప్రాయమే వీరికి ముఖ్యమా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు వారి వారి అంతరాత్మలకు తెలియంది కాదు..!! కాకపోతే ఈ వాస్తవాలన్నీ జనాలంతా ఇప్పటికైనా పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది..!

ఇదంతా గమనించినవారు మాత్రం… “చంద్రబాబు పందిని చూపి నంది అంటే అదే నిజమని, నందిని చూపి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్లు ఆయన చుట్టూ పుష్కలంగా ఉన్నారని.. ఆయన పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ల సంఖ్య తగ్గిపోతోందని.. ఆ నాయకులకు తోడు పచ్చ (సోషల్) మీడియా బ్యాచ్‌ ఉండనే ఉందని.. ఇప్పటికీ అమరావతే ప్రధానం, దానికి మరో 50 వేల ఎకరాలు మీరు చేయాలి దారాదత్తం.. అంటే ఆనందంతో ఆర్త‌నాదాలు చేస్తున్నారని… ఇప్పుడు చంద్రబాబు.. మీ భార్య‌లు, భార్య‌లు కాద‌ని చెబితే గుడ్డిగా న‌మ్మేసి క‌ట్టుకున్న‌దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడ‌డానికి కూడా వెర‌వ‌ని వెన్నెముక లేని బ్యాచ్ ఆయన చుట్టూ త‌యారైంది” అని రాస్తూ.. “ఆ” పత్రికాధినేత “పలుకు”ను రివర్స్ లో అప్లై చేస్తున్నారు!!