జగన్ అమిత్ షా చర్చల ఎజెండా ఏమిటి?

దీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. వాస్తవంలో ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రిని తరచూ కలుసుకొంటూ వుంటారు. కాని ముఖ్యమంత్రి ప్రధానిని కలసిన సమయం మాత్రం ప్రాధాన్యత కలిగి వుంది. ఇద్దరూ కూడా సమస్యల వలయంలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని మూడు రాజధానులను చేయబోయి అనూహ్యంగా శాసన మండలి రద్దు చేయ వలసి వచ్చింది. . ఈ రెండు గండాల నుండీ బయట పడాలంటే కేంద్రం సహకారం తప్పని సరి. మరో వేపు ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది అనిశ్చిత స్థితిలో ప్రధాని వున్నారు. ఒక్కో రాష్ట్రం చేజారుతోంది. ఒక్కో మిత్రుడు టాటా చెప్పి వెళ్లుతున్నారు. పైగా రాజ్యసభలో బిల్లులు సులభంగా ఆమోదం పొందాలంటే ప్రాంతీయ పార్టీల అండ అవసరం. అంటే ఇద్దరూ పరస్పరం సహకరించుకోవలసి అవసరాలు వున్నాయి. ఈ సమయంలో వీరి భేటీ భిన్న కథనాలకు దారి తీసింది. ఇంతవరకు ముఖ్యమంత్రి అవలంభించిన కొన్ని విధానాలపై కేంద్రం చట్ట సభల్లోనే వ్యతిరేకత వెలుబుచ్చినందున దాన్ని ఆధారం ప్రధాని మంత్రి ముఖ్యమంత్రికి అక్షింతలు వేశారని ఒక రకమైన మీడియాతో పాటు టిడిపి నేతలు కథనాలు అల్లారు. వాస్తవంలో వీరు ఇరువురు బేటీలో మూడో వ్యక్తి వుండరు కాబట్టి ఇలాంటి కథనాలకు కొశ్ఛన్ మార్క్ పెట్ట వలసినదే.

మరో వేపు ఏన్ఢీఎలో వైసిపి చేర బోతున్నదని కేంద్రంలో రెండు మంత్రి పదవులు దక్కబోతున్నాయని వైసిపి అనుకూల సోషల్ మీడియా వివిధ కథనాలు ప్రచారంలో పెడుతోంది. దీనికి తోడు ఎపిలో మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటు తమకు ఇమ్మని ప్రధాని ముఖ్యమంత్రిని కోరినట్లు కూడా ప్రచారం వుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పొందకుండా వైసిపి కేంద్ర ప్రభుత్వంలో చేరినా రాజ్యసభ సీటు బిజెపికి ఇచ్చినా చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న దుస్థితి ముఖ్యమంత్రికి తప్పదు. 25 పార్లమెంటు స్థానాలు కట్టబెడితే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో మంత్రి పదవులు పొందటం లేదా రాజ్యసభ సీటు బిజెపికి కట్టబెడితే మున్ముందు ఎపిలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా వుంటాయని వైసిపి సన్నిహిత వర్గాలు ఊహించ లేక పోతున్నారంటే ఆశ్చర్యమేస్తోంది

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ప్రధాన మంత్రిని కలసిన తర్వాత చర్చల కొనసాగింపుగా శుక్రవారం సాయంకాలం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిశారు. ఏమాత్రం ఊహ వున్నా ముఖ్యమంత్రికి తల నొప్పులు తెచ్చి పెడుతున్న శాసన మండలి రద్దు అతి ముఖ్యమైనది గా వుంది. హోం శాఖ ఫైలు కదిలించితే గాని ఒక కొలిక్కి రాదు. . అయితే ఈ అంశాలేవీ చర్చనీయాంశంగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. కేందంలో వైసిపి తరపున మంత్రులుగా చేరే వారి పేర్లు ఇచ్చేందుకు బేటీ జరుగనున్నదనే కథనాలు వండి వార్చారు. దీనికి తోడు చంద్రబాబు నాయుడు పియస్ ఇంటిపై ఐటి దాడులు జరగడం పైగా ఐటి శాఖ అస్పష్టంగా ప్రకటన కూడా చేయడంతో రేపో మాపో చంద్రబాబు నాయుడు అరెస్టు తఫ్ఫదనే ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి బేటీ జరగడం మరింత సంచలనంగా మారిందని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి.