అఫిషియల్: ‘మహర్షి’కోసం వెంకీ,దేవరకొండ

మహేష్ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు (మే 1న) బుధవారం హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ ఈవెంట్‌ను మరింత స్పెషల్‌గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి మహేష్ బాబుతో పనిచేసిన దర్శకులందరినీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అలాగే.. ఈ ఈవెంట్‌కు స్పెషల్‌ గెస్ట్‌గా విక్టరీ వెంకటేశ్ రానున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కోసం వెంకటేశ్, మహేశ్ బాబు తొలిసారిగా కలిసి నటించగా.. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో గతంలో మహేశ్ నటించిన ‘శ్రీమంతుడు’ ఆడియో ఫంక్షన్‌కు కూడా వెంకటేశ్ చీఫ్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. విజయదేవరకొండ సైతం ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తున్నారు.

వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘మహర్షి’ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. దిల్ రాజ్, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మహేశ్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం కావడం, ఇప్పటికే రిలీజైన టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో ‘మహర్షి’పై అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.