మెగాస్టార్‌తో త్రివిక్ర‌మ్ మూవీ 2022లోనే

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ ఎప్పుడు సెట్స్ కెళ్ల‌నుంది? అంటే అది ఇప్ప‌ట్లో సాధ్యం కాద‌నే ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి తాను సిద్ధ‌మేన‌ని `విన‌య విదేయ రామా` ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్ప‌టికీ సాధ్య‌ప‌డ‌లేదు.

ప్ర‌స్తుతం కొర‌టాలతో ఆచార్య చిత్రీక‌ర‌ణ కోసం వేచి చూస్తున్నారు చిరు. త్రివిక్రమ్ కంటే ముందే కొర‌టాల క్యూలోకి రావ‌డంతో ఆచార్య గ్రాఫ్ లో ముందుకొచ్చి త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ వెన‌క్కి వెళ్లింది. కొరటాల చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత మాత్రమే త్రివిక్ర‌మ్ తో చిరు చిత్రం ప్రారంభమవుతుంది. ఈలోగా ఎన్టీఆర్ తో త‌దుప‌రి చిత్రాన్ని త్రివిక్ర‌మ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే 2022 లో మాత్రమే ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది. వైర‌స్ మ‌హ‌మ్మారీ వ‌ల్ల వ‌రుస‌గా షూటింగుల‌న్నీ వాయిదా ప‌డ‌డంతో అంత‌కంత‌కు ప్ర‌తిదీ ఆల‌స్య‌మైపోతుండ‌డం ఇబ్బందిక‌రంగా మారింది. మ‌రోవైపు ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌క‌పోవ‌డంతో ఆచార్య‌లో కీల‌క పాత్ర పోషించాల్సిన చ‌ర‌ణ్ అందుబాటులోకి వ‌చ్చే వీలు లేకుండా పోయింది. దీనివ‌ల్ల ఆచార్య చిత్రం మ‌రింత ఆల‌స్య‌మ‌వుతోంది.