సునీల్ కమెడియన్ గా రీఎంట్రీ ఈ సినిమాతోనే

కమెడియన్ గా దశాబ్ద కాలంపాటు ప్రేక్షకుల్ని అలరించాడు సునీల్. మధ్యలో అందాల రాముడు, మర్యాద రామన్న సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ కామెడీ వేషాలు వదులుకోలేదు. మర్యాద రామన్న తర్వాత కూడా ఖలేజా, మిరపకాయ వంటి సినిమాల్లో హాస్య నటుడిగా కనిపించాడు. ఆ తర్వాత రాజమౌళి ఇచ్చిన సలహాతో కేవలం హీరోగా నటించటానికే ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన సునీల్ సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. జక్కన్న, ఉంగరాల రాంబాబు, 2 కంట్రీస్ సునీల్ కి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ కమెడియన్ గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు సునీల్.

శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో సునీల్ కమెడియన్ గా సందడి చేయనున్నాడు. గతంలో శ్రీనువైట్ల తీసిన ‘రెడీ, దుబాయ్ శీను, ఢీ’ వంటి సినిమాల హిట్లో సునీల్ కామెడీ కూడా ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా సునీల్ కామెడీ ప్లస్ అయితే కమెడియన్ గా ఇండస్ట్రీలో మళ్ళీ బిజీ అయిపోయే అవకాశముంది సునీల్ కి. కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా కూడా ఈ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వటం మరో విశేషం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 28 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.