లక్ కోసం….పేరు మార్చుకున్న మెగా హీరో

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువ. హిట్ వచ్చినా అందుకు కారణమైన సెంటిమెంట్ కారణం వెతుకుతారు. ప్లాఫ్ వచ్చినా అందుకు కారణం అంటూ మరో సెంటిమెంట్ ని నమ్ముతారు. అప్పటిదాకా వెలిగిన వారు కూడా కొద్దిగా వెనకబడేసరికి ఏం చేయాలో తోచక రకరకాల సెంటిమెంట్స్ ని ఆశ్రయిస్తారు. అందులో ముఖ్యంగా న్యూమరాలిజీ అనేది సినిమావాళ్లు బాగా నమ్మేది.

దాన్ని నమ్మి తమ పేరుని మార్చుకుంటారు. అలా మార్చుకున్నవాళ్లు మళ్లీ ఫామ్ లోకి వచ్చిన వాళ్లు ఉన్నారు. మార్చినా జీవితంలో మార్పు రాక అలా మిగిలిపోయిన వాళ్లు ఉన్నారు. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ పరిస్దితి అదే.

వరస పెట్టి ఆరు ఫ్లాప్‌ లు రావటంతో సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరును మార్చుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్‌ అయిన చిత్రలహరిలోని పరుగు పరుగు పాట లిరికల్‌ వీడియోలో సాయి ధరమ్‌ తేజ్‌ పేరును సాయి తేజ్‌ అని వేయటం గమనించవచ్చు. సినిమాలో కూడా టైటిల్స్‌లో ఇదే పేరు పడుతుందన్న మెగాభిమానులు అంటున్నారు . ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ ని నమ్ముతాడు అనటంలో సందేహం లేదు.

ప్రస్తుతం చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సాయి సక్సెస్‌ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. సాయిధరమ్‌తేజ్, కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌ హీరోహీరోయిన్లుగా, ‘నేను శైలజా’ ఫేమ్‌ కిషోర్‌ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘చిత్రలహరి’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, రవి శంకర్‌ నిర్మించారు. ఏప్రిల్‌ 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సుకుమార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.