సాయి ధరమ్ తేజ్ కోరిక మేరకు ‘రిపబ్లిక్’ విడుదల: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ‘రిపబ్లిక్’ ట్రైలర్ విడుదలయ్యింది. దేవ కట్టా ఈ చిత్రానికి దర్శకుడు. కలెక్టర్ పంజా అభిరామ్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ సినిమా. జగపతిబాబు, రమ్యకృష్ణ, ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రమ్యకృష్ణ పొలిటీషియన్ పాత్రలో కనిపిస్తుండడం గమనార్హం. రమ్యకృష్ణది పూర్తిగా నెగెటివ్ రోల్ అన్నట్టే వుంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తోందన్నది ఈ చిత్రంలో దర్శకుడు చూపించే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. కలెక్టర్ల విధుల్లో రాజకీయ జోక్యం.. ఆ రాజకీయ వ్యవస్థను నిలదీసే కలెక్టర్ అభిరామ్.. ఇలా సాగుతుంది సినిమా. సాయి ధరమ్ తేజ్ డైలాగులు మెప్పిస్తున్నాయి. అదే సమయంలో రమ్యకృష్ణకీ నెగెటివ్ యాంగిల్‌లోనే అయినా పవర్ ఫుల్ డైలాగులు రాశారు.

దేవ కట్టా సినిమాలు ప్రజల్ని ఆలోచింపజేస్తాయి, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తాయి. ఇదిలా వుంటే, కమర్షియల్ ఆలోచనల్ని పక్కన పెట్టి, సొసైటీకి మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయాలని ‘రిపబ్లిక్’ సినిమాని సాయధరమ్ తేజ్ ఎంచుకోవడం అభినందించదగ్గ విషయమే. అయితే, ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఆ మధ్య కాస్త నెమ్మదించింది. ఒకానొక దశలో వరుస ఫ్లాపులతో డీలాపడ్డాడు. మరి, ఈసారి సాయిధరమ్ తేజ్ ఎలా పుంజుకుంటాడు.? రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయిధరమ్ తేజ్, ప్రస్తుతం కోలుకుంటుండగా, అతని కోరిక మేరకే సినిమాని విడుదల చేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి పేర్కొనడం గమనార్హం. తేజు ప్రమాదానికి గురవడంతో, సినిమా విడుదల వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు. అయితే, అందుకు భిన్నంగా సినిమా.. అనుకున్న సమయానికే థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఓటీటీ ఆఫర్లను కూడా ‘రిపబ్లిక్’ టీమ్ కాదనుకుంది.