అక్కా చెల్లెళ్ల అనుబంధం అదుర్స్‌

క‌పూర్ సిస్ట‌ర్స్ బాలీవుడ్ ని షేకాడించే టైమ్

బాలీవుడ్‌లో టీనేజీ సిస్ట‌ర్స్‌లో శ్రీ‌దేవి గారాల కుమార్తెలు జాన్వీ క‌పూర్‌- ఖుషీ క‌పూర్ ప్ర‌త్యేక‌త ఏమిటో తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ‌ల‌ అనుబంధం సంథింగ్ స్పెష‌ల్‌. చిన్నత‌నం నుంచి ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం.. ఒక‌రంటే ఒక‌రికి ప్రేమ‌భిమానాల గురించి మామ్ శ్రీ‌దేవి చాలానే చెప్పారు. మామ్ మ‌ర‌ణం త‌ర్వాత ఈ బంధం మ‌రింత‌గా పెనుబంధ‌మైంది. ఆ అనుబంధాన్ని సోష‌ల్ మీడియా ద్వారా జాన్వీ తాజాగా మ‌రోసారి హత్తుకునే ఫోటో ద్వారా బ‌య‌ట‌పెట్టింది. త‌న చెల్లెలు త‌న‌ని వీడి న్యూయార్క్ వెళుతుండ‌టంతో భావోద్వేగానికి లోనైన జాన్వీ త‌న చెల్లెలితో క‌లిసి దిగిన షొటోని షేర్ చేస్తూ చెల్లెలిపై త‌న‌కున్న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టింది.

ముంబైలో ఎక్క‌డికి వెళ్లినా జాన్వీకి తోడుగా ఖుషీ వుండాల్సిందే. అంత‌గా చేరువైన సిస్ట‌ర్స్ కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాల్సిన ప‌రిస్థితి. ధ‌డ‌క్‌ సినిమాతో జాన్వీ అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌రువాత వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ అంద‌రి దృష్టిని జాన్వీ ఆక‌ర్షిస్తోంది. ఇప్పుడు ఖుషీ వంతు రాబోతోంది. జాన్వీలానే ఖుషీ తెరంగేట్రం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇందు కోసం న‌ట‌న‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ కోసం న్యూయ‌ర్క్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరుతున్న ఖుషీ తొలిసారి జాన్వీని వీడి న్యూయ‌ర్క్ బ‌య‌లు దేరింది. దీంతో భావోద్వేగానికి గురైన జాన్వీ త‌న చెల్లెలు వెళ్లిపోతుంటే త‌ట్టుకోలేక‌ త‌న‌కి సెండాఫ్ ఇవ్వ‌డానికి ఏయిర్ పోర్ట్‌కి వెళ్ల‌లేక‌పోయింద‌ట‌. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న చెల్లెలితో క‌లిసి పంచుకున్న ఫొటోని షేర్ చేయ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫొటో చూసిన నెటిజ‌న్స్ అంతా అక్కా చెల్లెళ్ల అనుబంధం అదుర్స్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.