ఈ రోజు మధ్యాహ్నం ..మొదలవుతుంది మెగా రచ్చ

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యాక్షన్ సినిమాల మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా తెలియచేసారు.

నవంబర్‌ 6 మధ్యాహ్నం ఒంటి గంటకు చెర్రీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను నవంబర్‌ 9 ఉదయం 10:25 గంటలకు విడుదలచేయనున్నట్లు ప్రకటించారు.

ఈ చిత్రానికి ‘స్టేట్‌ రౌడీ’, ‘వినయ విధేయ రామ’ అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి…ఏ టైటిల్ ఫైనల్ చేస్తారన్నది రేపు తెలిసిపోతుంది. సో రేపంతా రామ్ చరణ్ స్మరణ, ఆ సినిమా గురించిన విశేషాలే మీడియాలో హల్ చల్ చేయనున్నాయన్నమాట. ఇక మెగాభిమానులు సైతం ఆ ఫస్ట్ లుక్ ని షేర్ చేయటానికి ఆ సమయంలో ఏ పనులు పెట్టుకోకుండా ఎదురుచూడటానికి రెడీ అవుతున్నారు.

ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా కియారా అడ్వాణీ కనిపించనున్నారు. రీసెంట్ గాఈ సినిమా షూటింగ్ పూర్తయింది. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.