సూపర్ స్టార్ రజనీకాంత్ .. విశ్వనటుడు కమల్ హాసన్ మధ్య స్నేహం గురించి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ దశాబ్ధాల పాటు కొనసాగుతోంది. అయితే ఈ స్నేహం చెడిందా? రాజకీయాల వల్ల ఆ ఇద్దరి మధ్యా దూరం పెరుగుతోందా? అంటే .. ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇది.
తలైవా రజనీకాంత్.. కమల్ హాసన్ ఎవరికి వారు రాజకీయంగా పావులు కదుపుతున్నా.. రజనీ మాత్రం పూర్తిగా రాజకీయాల్లోకి దూకేయలేదు ఇంకా. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు కమల్ హాసన్ మాత్రం అడపాదడపా సినిమాలకు సంతకాలు చేస్తూ.. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీని స్థాపించి చురుగ్గా రాజకీయాల్లో తిరిగేస్తున్నారు. ఆ క్రమంలోనే తాను నిర్మాతగా రాజ్ కమల్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తీయాలని భావించారు. అది కూడా ఖైదీ (కైథీ) ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించాలని ప్లాన్ చేశారు.
అయితే ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందంటూ కోలీవుడ్ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. అసలింతకీ ఏమైంది? అంటే.. రజనీకాంత్ ఇకపై పూర్తి రాజకీయాలకే సమయం కేటాయించనున్నారన్న సమాచారం అందింది. అంటే ఇకపై కమల్ హాసన్ పార్టీతో పోటీపడుతూ రజనీకాంత్ రాజకీయాలు చేయబోతున్నారా? అన్న చర్చ అభిమానుల్లో మొదలైంది. అయితే సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. దేని దారి దానిదే. కమల్ – రజనీ జాయింట్ గానే పలు అంశాలపై అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. అంటే ఆ ఇద్దరి మధ్యా స్నేహం పూర్తిగా చెడినట్టేమీ కాదు. మరి ఆ కోణంలో అయినా స్నేహితులు ఇద్దరూ కలిసి ఎలాంటి భేషజాలు లేకుండా సినిమాలు చేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.
కమల్ ప్రస్తుతం భారతీయుడు 2 చిత్రంతో బిజీగా ఉంటే రజనీకాంత్ దరువు శివతో సినిమా చేస్తున్నారు. లోకేష్ ఏకంగా ఇలయదళపతి విజయ్ తో సినిమా చేస్తూ బిజీ. మరి ఈ ముగ్గురి కాంబినేషన్ సాధ్యమైతే అది ఎంతో క్రేజీగా ఉండేది. కానీ క్యాన్సిల్ అయితే అభిమానులకు నిరాశ మిగిలినట్టే.