పూరిజగన్నాథ్ దర్శ కత్వంలో ‘రౌడీ’ హీరో ?

పూరిజగన్నాథ్ రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు పూరిజగన్నాథ్ ఈ చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టారు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో రెట్టించిన ఉత్సాహంతో వున్న ఆయన తదుపరి చిత్రాన్ని క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండతో పూరి చర్చలు మొదలుపెట్టారని, విజయ్ కూడా ఆయనతో కలిసి పనిచేయడానికి సుముఖంగానే వున్నారని తెలిసింది. విజయ్ దేవరకొండ శైలికి పూరి జగన్నాథ్ మార్కుని జోడించి ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి నిర్మాత ఎవరనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి విశేషాల్ని పూరిజగన్నాథ్ టీమ్ వెల్లడించనున్నట్లు తెలిసింది.