ఇంతకీ క్షమాపణ చెప్తారా, వరుణ్ తేజ్ ఏమంటారో

సినిమా వివాదాలు టాలీవుడ్ కి కొత్తేమీ కాదు. అందులోనూ టైటిల్ వివాదాలు మరీ కామన్. అయితే ఈ వివాదాలు కేవలం టైటిల్ రిజిస్ట్రేషన్ దగ్గరే మొదలవుతూంటాయి. కానీ బయిట నుంచి ఆ టైటిల్ పెట్టడానికి వీల్లేదని అనరు. కానీ వరుణ్ తేజ్ తాజా చిత్రానికి అదే సమస్య వస్తోంది.

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న భారీ చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రం జనవరి 27న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. మొదలయ్యి మూడు రోజులు కాలేదు అప్పుడే ఈ చిత్రానికి అప్పుడే అడ్డంకులు మొదలయ్యాయి. సినిమా టైటిల్ లోగోపై రివాల్వర్ ఉండడం అనేది తమ వర్గాన్ని కించపరిచే విధంగా ఉందని వాల్మీకి సంఘం అధినేత సాయి ప్రసాద్ తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంటనే వాల్మీకి టైటిల్ ను మార్చాలని లేదంటే సినిమా షూటింగ్ ను అడ్డుకుంటామని, తమ మనో భావాలను దెబ్బ తీసినందుకు చిత్ర యూనిట్ క్షమాపణ చెప్పాలని, వాల్మీకి పేరుపై భక్తిరస చిత్రాలు తెరకెక్కిస్తే తమకు అభ్యంతరం లేదని… వినోదం పేరుతో తమ సామాజిక వర్గం పేరును కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై ఇంకా చిత్రబృందం స్పందించలేదు.

తమిళ్‌ వర్షెన్‌లో విలన్ గా బాబీ సింహా మెప్పించగా.. అదే పాత్రలో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.