ప్రకాష్ రాజ్ నుంచి షాకిచ్చే ప్రకటన

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ నూతన సంవత్సరం రోజున షాకిచ్చే ప్రకటన చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ తరువాత రాజకీయ ప్రకటన చేసిన నటుడిగాప్రకాష్ రాజ్ నిలిచారు. ‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీఅందరి మద్ధతుతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న. ఎక్కడి నుంచి అనేది త్వరలోనే ప్రకటిస్తా. వచ్చేది ప్రజా ప్రభుత్వమే’’ అంటూప్రకాష్ రాజ్ మంగళవారం ట్వీట్‌ చేశాడు. 

గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెడుతూ ఆయన తరచుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సీఎం కేసీఆర్‌తో కలిసి పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల వేళప్రకాష్ రాజ్ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తన స్నేహితురాలైన కన్నడ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్యానంతరం ఆయన తన విమర్శలకు మరింత పదును పెట్టారు. ప్రకాష్ రాజ్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో ప్రకటించగానే చాలా మంది సానుకూలంగా స్పందించారు. ఆయన రాజకీయ రంగంలో విజయం సాధించాలని ఆశిస్తూ రీ ట్వీట్లు చేశారు. పోస్ట్‌ చేసిన గంటలోపే లైక్‌ ల వర్షం కురిసింది.