చారిత్ర‌క క‌థ‌తో ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ

`కేజీఎఫ్: చాప్టర్ 1` ఘ‌న‌విజ‌యం అనంత‌రం దర్శకుడు ప్రశాంత్ నీల్ కు భారీ డిమాండ్ నెల‌కొంది. కేజీఎఫ్ 2 రిలీజ్ అయితే త‌దుప‌రి ప్రాజెక్ట్ కోసం పలువురు టాలీవుడ్ నిర్మాతలు ఆయ‌న‌ను ఇప్ప‌టికే సంప్రదించారు. తన తదుపరి ప్రాజెక్టుపై సంతకం చేయడానికి చాలా సమయం పట్టింది. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టిస్తున్నార‌న్న‌ది దాదాపు అధికారికంగా ఖ‌రారైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌నుంది.

ప్రశాంత్ నీల్ కి ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ కూడా చెల్లించారు. హైదరాబాద్‌లో మూడుసార్లు ఎన్‌టీఆర్‌ను కలిసి స్క్రిప్టును కూడా వినిపించారు. ఎన్‌టిఆర్ కోసం ఓ భారీ పీరియాడిక‌ల్ యాక్షన్ డ్రామాను ఎంపిక చేసుకున్నాడు ప్ర‌శాంత్ నీల్. పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయాల్సిందిగా ఎన్టీఆర్ ఇదివ‌ర‌కూ త‌న‌ని కోరారుట‌. `కెజిఎఫ్: చాప్టర్ 2` పూర్త‌యిన అనంత‌రం.. ప్రశాంత్ నీల్ తో సినిమా ప్రారంభించాలంటే ఎన్‌టిఆర్ కు కాస్త‌ సమయం పడుతుంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ స్థాయిలో తెర‌కెక్కించాల‌నే ఆలోచనలో ఉన్నాడు. అంటే అన్ని భారతీయ భాషలలో విడుదల చేసేంత భారీ కాన్వాస్ తో ఉండాల‌న్న‌ది అత‌డి ఆలోచ‌న‌. బడ్జెట్లపై మునుముందు ప్లాన్ చేస్తార‌ట‌. ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే ముందు రేంజ్ ఎంత ఉంటుంది? అన్న‌ది ఫిక్స్ చేస్తార‌ట‌.