చూస్తూంటే తెలియకుండా కన్నీళ్లొచ్చేశాయి: ఎన్టీఆర్‌

కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన ‘118’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. బాలకృష్ణ, ఎన్టీఆర్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యి సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. బాలయ్య తొలి సీడీని ఎన్టీఆర్‌కు అందించారు.

ఈ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన వీర జవాన్ల ఆత్మకు, ఇటీవల కన్నుమూసిన తెలుగు సినీ దిగ్గజాలు విజయ్‌ బాపినీడు, కోడి రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించమని ఎన్టీఆర్‌ కోరారు. అందరూ కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘118’ చిత్రాన్ని నేను చూశా. నివేదా చేసిన ఓ సీన్‌లో నాకు తెలియకుండానే నా కళ్ల నుంచి నీళ్లు రావడం మొదలైంది. నిజంగా ఈ జనరేషన్‌లో ఆమె ఓ గొప్ప నటి. షాలిని గారు కూడా చాలా కష్టపడ్డారు. ఈ చిత్ర విజయానికి వీరిద్దరూ కూడా కారణం కాబోతున్నారు’ అని చెప్పారు.

అలాగే ‘గుహన్‌ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. ఆయన కెమెరామెన్‌గా ఉన్నప్పుడు మేం ‘బాద్‌షా’ సినిమా కోసం కలిసి పనిచేశాం. ఆయన ఎంతో శ్రమించే వ్యక్తి. ‘బంతిపూల జానకి’ పాట కోసం -13 డిగ్రీల్లో డ్యాన్స్‌ చేశాం. ఆర్టిస్టులకు కాస్త సౌకర్యాలు కల్పిస్తుంటారు. అప్పుడప్పుడు హీటర్లు మా దగ్గర పెడుతుంటారు. కానీ, ఆయన మాత్రం చలిలోనే ఉండి, షూట్‌ చేశారు. గొప్పగా ఆయన ఆ పాటను తీశారు. ఇప్పుడు కూడా అదే ఏకాగ్రతతో ‘118’ చిత్రం తీశారు. నివేదా గారితో ‘జైలవకశ’ కోసం పనిచేశారు’ అని చెప్పారు.

ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ.. ‘బాబాయి, తమ్ముడు నాకోసం రావడం సంతోషంగా ఉంది. ఈసారి సినిమా విడుదలైన తర్వాత మాట్లాడతా. ‘118’పై నాకు చాలా నమ్మకం ఉంది. ప్రతిసారి ఏదో ఒక కొత్త దనాన్ని మీ ముందు ఉంచాలనే తపనతో సినిమా చేస్తున్నా. కానీ ఓడిపోతున్నా. మిమ్మల్ని మెప్పించే వరకూ ఇలానే ప్రయత్నిస్తూ ఉంటాను’ అని అన్నారు.

ఈ చిత్రానికి కేవీ గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. షాలినీ పాండే, నివేదా థామస్‌ హీరోయిన్స్ . మహేశ్‌ కొనేరు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 28న అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్‌ షో నిర్వహించబోతున్నారు. నిర్వాణ సినిమాస్ సంస్థ ఈ‌ చిత్రాన్ని విదేశాల్లో విడుదల చేయబోతోంది. మార్చి 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.