ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం నిజం : మోహన్‌బాబు

రీసెంట్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపంచిన వైస్రాయి ఎపిసోడ్ నిజమే అని ధృవీకరించారు ప్రముఖ నటుడు మోహన్ బాబు. వైస్రాయ్‌ హోటల్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం వాస్తవమని, అది తాను చూశానని సినీనటుడు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు మంచు మోహన్‌బాబు స్పష్టం చేశారు.

‘నేను చేసిన తప్పెంటో చెప్పండి బ్రదర్‌.. తప్పు సరిద్దిదుకుంటాను’ అని వేడుకున్న అన్నగారిపై చంద్రబాబు చెప్పులు వేయించారని మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలో మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. నాయకులందరినీ చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటారని, అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు రక్తంలో జీర్ణించుకు పోయిందని ధ్వజమెత్తారు.

అలాగే ‘ప్రస్తుతం ఉన్న టీడీపీ అన్నయ్య(ఎన్టీఆర్‌)ది కాదు.. చంద్రబాబు ఆక్రమించిన పార్టీ. అన్నయ్యేదే అయితే నేను పార్టీ వీడేవాడినే కాదు. ఆ మహానేత పార్టీనే ఆక్రమించి ఆయన సభ్యత్వాన్నే తీసేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. హరికృష్ణ, తారక్‌, సుహాసినిలను వాడుకుని వదిలేశారు.

ఎవరైనా బాగుంటే చాలు.. వారిని నాశనం చేసే వరకు నా స్నేహితుడు చంద్రబాబు వదలరు. ఆ సమయంలో అన్నయ్య చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడీలు విడుదల చేశారు. చంద్రబాబు పాపిష్టి, నికృష్టుడు, మోసకారని ఆ వీడియోల్లో ఆవేదన వ్యక్తం చేశారు.