“మా ” రొంపిలో దిగనన్న మహేష్ బాబు

పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుంది ఇప్పుడు “మా ” పరిస్థితి . పేరుకేమో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ,గ్లామర్ హీరోలంతా అందులో సభ్యులు . కానీ ఆ అసోసియేషన్ ఇప్పుడు అపార్ధాలు, ఆరోపణలు, దూషణలకు నిలయమై పోయింది. అది ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయింది . శివాజీరాజా వర్గం, నరేష్ వర్గం . మా రజతోత్సవం ఘనంగా చేద్దామనుకున్నారు . భవనం కట్టుకోవడాని డబ్బు వసూలు చేయాలనుకున్నారు . అమెరికా అయితే డాలర్స్ రాలతాయనుకున్నారు . చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తో అమెరికాలో షోలు నిర్వహించాలనుకున్నారు . ఇటీవలే చిరంజీవితో పాటు కొంత మంది ఆర్టిస్టులు అమెరికా వెళ్లారు . అనుకున్న డబ్బు వసూలు కాలేదని అయితే వెళ్ళినవారు మాత్రం జల్సా చేసి వచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి . వచ్చిన డబ్బు కూడా శివాజీ రాజా తదితరులు నొక్కేస్సారని నరేష్ ఆరోపణ.

ఈవిషయం మీద మీడియా సమావేశం పెట్టి ,తిట్లు , శాపనార్ధాలతో హోరెత్తించారు . ఈ రగడకు చానెల్స్ లైవ్ లో చూపించాయి . ఒక రకంగా చెప్పాలంటే గ్లామర్ ఫీల్డ్ ఇంత దరిద్రంగా ఉంటుందా అని సామాన్య ప్రేక్షకుడు ఆశ్చర్య పోతున్నాడు . ఇదిలా సాగుతూ , ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలో సీరియల్ గా రావడం చూసి హీరో మహేష్ బాబు మనసు మార్చుకున్నాడట . మహేష్ అక్టోబర్ లో అమెరికా వస్తానని “మా ” వారికి చెప్పాడు . ఇందుకు వారు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు . రెండు రోజుల క్రితం నరేష్ మహేష్ బాబు ప్రోగ్రాం ఉందని చెప్పాడు . అయితే తాజాగా మహేష్ అమెరికా రానని చెప్పడట . అదీ డైరెక్ట్ గా చెప్పలేక తన శ్రీమతి నమ్రతతో చెప్పించినట్టు ఫిలిం నగర్ కోడై కూస్తోంది .