రజనీ ఫ్యాన్స్ కు మరో కానుక, ‘పెట్టా’ కొత్త పోస్టర్ ఇదిగో

సూపర్‌స్టార్‌ ర‌జ‌నీకాంత్ న‌టించిన 2.0 చిత్రం న‌వంబ‌ర్ 29న విడుద‌ల కాగా, ఈ చిత్రం భారీ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు త‌లైవ‌ర్ ఫ్యాన్స్‌. వాళ్లు ఆ ఉషారులో ఉండగానే…రజనీ తన లేటెస్ట్ చిత్రం ‘పెట్టా’ లేటెస్ట్ పోస్టర్ వదిలి..దాన్ని రెట్టింపు చేసారు.

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెట్టా’. కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2019 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి తొలి సాంగ్‌ని డిసెంబ‌ర్ 3 సాయంత్రం 6గం.లకి విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ విష‌యాన్ని ర‌జనీకాంత్ స్టైలిష్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ ప్ర‌క‌టించారు. పోస్ట‌ర్‌లో ర‌జ‌నీని చూసిన ఫ్యాన్స్ సంతోషానికి అవ‌ధులు లేకుండా పోయాయి. భాషా గెట‌ప్‌లో ర‌జ‌నీకాంత్ ఉన్నార‌ని, ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని అభిమానులు పండగ చేసేసుకుంటున్నారు.

‘పెట్టా’ చిత్రంలో రజనీకి జోడీగా త్రిష, సిమ్రన్‌ నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధిమారన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ గ్యాంగ్‌స్టర్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఖైదీగా కూడా కన్పించనున్నట్లు తమిళ సినీ వర్గాల వర్గాల సమాచారం.

ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు అరెస్ట్‌ అయిన 109వ ఖైదీగా రజనీ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా మూడో షెడ్యూల్‌ను లఖ్‌నవూలో షూటింగ్ జరుగుతోంది. తర్వాత కాశీలో రజనీ, త్రిషకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.