సీసీసీ ట్ర‌స్ట్ చిరంజీవికి ఇంట్రెస్ట్ లేదా?

క‌రోనా మ‌హ‌మ్మారీ ఇత‌ర రంగాల్లానే.. టాలీవుడ్ ని .. సినీ కార్మికుల్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వినోద‌ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా ప్ర‌భావం అసాధార‌ణంగా ఉంద‌ని తాజా ప‌రిస్థితులు చెబుతున్నాయి. ఉపాధి కోల్పోయిన సినీకార్మికులు నిత్యావ‌స‌రాల‌కు సైతం ఇబ్బంది ప‌డే ప‌రిస్థితి నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే ఇండ‌స్ట్రీ పెద్ద‌లు దీనిపై స్పందించి మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో సీసీసీ క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ సేవా సంస్థ ద్వారా సినీకార్మికుల‌కు త‌క్ష‌ణ సాయం అందించనున్నారు.

హైద‌రాబాద్ లో జ‌రిగిన సీసీసీ కార్య‌క్ర‌మంలో కార్మికుల త‌ర‌పున‌ సినీపెద్ద‌ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ-“కార్మికుల‌కు మంచి జ‌ర‌గాల‌ని చిరంజీవి గారు వెంట‌నే స్పందించి సేవ‌కు ముందుకొచ్చారు. వెంట‌నే సీసీసీ ట్ర‌స్ట్ ని ప్రారంభించారు. దీనికి స్పందించిన సెల‌బ్రిటీలంతా చారిటీకి విరాళాలు పంపారు. అయితే బ్యాంకుల‌కు సెల‌వుల వ‌ల్ల ఇత‌ర కార‌ణాల వ‌ల్ల సరుకుల‌ పంపిణీ ఆల‌స్య‌మైంది. ముందుగా జాబితాను రూపొందించి అంద‌రికీ వారంలోగా అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మేమే కార్మికుల ఇంటింటికి వెళ్లి సాయం అందిస్తాం. అలాగే అపోలో ఫార్మ‌సీ నుంచి రూ.500-1000 వ‌ర‌కూ ప్రిస్కిప్షన్ ఉంటే మందులు పంపిస్తారు. ఆ సాయానికి వారికి ధ‌న్య‌వాదాలు. ఇక సీసీసీ టెంప‌ర‌రీ గా కాకుండా ప‌ర్మినెంట్ గా ఇలాంటి స‌మ‌యాల్లో సాయం అందించ‌నుంది. ప్ర‌స్తుతం చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ నుంచే ఈ సాయం చేస్తున్నాం. ఇక నిరంత‌రం సీసీసీ త‌ర‌పున కార్మికుల‌కు సాయం చేయాల‌నే భ‌విష్య‌త్ లోనూ చారిటీ కొన‌సాగించేలా ప్ర‌ణాళిక రూపొందిస్తున్నాం. ఇక చిరంజీవి గారి ట్ర‌స్ట్ నుంచి వ‌చ్చే డ‌బ్బుల్ని అవ‌స‌రార్థుల‌కు వెంట‌నే అంద‌జేస్తున్నాం. ఎన్.శంక‌ర్ సార‌థ్యంలో ఇప్ప‌టికే జాబితాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇక నాయ‌కులు సినీకార్మికుల్లో క‌ష్టంలో ఉన్న‌వారిని పేద‌వారిని ఆదుకోవాలి“ అన్నారు. అంతేకాదు.. ఈ విష‌యాల్ని చెబుతూనే త‌మ్మారెడ్డి వేరొక విష‌యాన్ని ప్ర‌స్థావించారు. అదే సీసీసీ ఫండ్ ని చిరంజీవి ట్ర‌స్ట్ ద్వారా పంచాల‌నుకోవ‌డం చిరుకి ఇష్టం లేద‌ని అన్నార‌ని తెలిపారు.

అయితే అందుకు కార‌ణం కూడా స‌హేతుకం. క‌రోనా క‌ల్లోలంలో ఇంత హుటాహుటీన ప్రారంభించిన సీసీసీ ట్ర‌స్ట్ ఇంకా రిజిస్ట‌ర్ కావాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం రిజిస్ట్రేష‌న్ ఆఫీసుల‌న్నీ బంద్. ప్ర‌స్తుత‌ క‌రోనా దిగ్భంధనంలో అది కుదిరేప‌ని కాదు. అందుకే ఇంకా సీసీసీ ట్ర‌స్ట్ రిజిస్ట‌ర్ కాలేదు అని భ‌ర‌ద్వాజా అస‌లు విష‌యం వెల్ల‌డించారు. అందుకే ప్ర‌స్తుతం చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ త‌ర‌పున సాయం అందిస్తున్నామ‌ని అన్నారు. సీసీసీ ట్ర‌స్ట్ సొమ్ముల్ని చిరంజీవి ట్ర‌స్టుకి బ‌ద‌లాయించ‌డం ఇష్టం లేక‌నే ఆయ‌న అలా అన్నారా? నిజాయితీగా ఆ డ‌బ్బు అంద‌రికీ చేరాల‌ని .. అది చిరంజీవి ట్ర‌స్ట్ కి సంబంధం లేకుండా జ‌ర‌గాల‌ని చిరంజీవి భావించారా? అన్న సందేహాల్ని ఇది రేకెత్తించింది.

తాజా సీసీసీ స‌మావేశంలో ద‌ర్శ‌క‌సంఘం అధ్య‌క్షుడు ఎన్.శంక‌ర్ మాట్లాడుతూ-“మ‌రో మూడు రోజుల్లోనే నిత్యావ‌స‌రాలు అయిపోతాయి అనుకున్న కార్మికులంద‌రూ వెంట‌నే సంప్ర‌దించండి. వివ‌రాల్ని అందిస్తే వారికి వెంట‌నే స‌రుకులు అందిస్తాం. ఇది నిరంత‌ర సేవ‌. అంద‌రికీ ఈ సేవ‌లు అందుతాయి. చిరంజీవి గారు.. భ‌ర‌ద్వాజ గారు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. వారి స‌ల‌హా మేర‌కు నిత్యావ‌స‌రాలు కావాల‌నుకునేవారికి నేరుగా డోర్ డెలివ‌రీ అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాం. మీరు ఇండ్ల‌లోనే ఉండండి .. క‌రోనాపై పోరాడండి.. మేమే మీకు అన్ని ర‌కాలా సేవ‌లందిస్తాం. రాజ‌కీయాల‌క‌తీతంగా అంద‌రికీ సాయ‌ప‌డతాం“ అని అన్నారు.