ఆచార్య సెట్స్‌కి చ‌ర‌ణ్.. జ‌క్క‌న్న‌కు టాటా!

ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ పూర్తి కాక‌ముందే వేరొక షూటింగుకి జాయిన్ కాకూడ‌ద‌న్న‌ది ఓ డీల్. అది జ‌క్క‌న్న రూల్. కానీ ఇప్పుడు ఆ రూల్ కి బ్రేక్ వేసి చ‌ర‌ణ్ నేరుగా ఆచార్య సెట్స్ లో జాయిన్ అవుతాడ‌ట‌. ఇక ఇన్నాళ్లు ఉపేక్షించినా మ‌హ‌మ్మారీ త‌గ్గేట్టు లేద‌ని అర్థ‌మ‌య్యాక చిరంజీవి-చ‌ర‌ణ్ బృందం ఆచార్య‌ సెట్స్ కెళ్లేందుకే నిర్ణ‌యించుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

పరిమిత సిబ్బందితొ పరిమిత స‌మ‌యానుకూలంగా.. కొత్త ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేస్తూ షూటింగ్ కొనసాగించడం తనకు సాధ్యం కాదని రాజమౌళి గ్రహించిన తరువాత ఆర్ఆర్ఆర్ చిత్రీక‌ర‌ణ‌ నిరవధికంగా వాయిదా వేశారు. ఏదేమైనా, షూటింగ్ పునః ప్రారంభాన్ని వాయిదా వేసే తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అలాగే ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదలను 2021 సెకండాఫ్ కి వాయిదా వేశాడు.

దీంతో రామ్ చరణ్ తొలిగా కొరటాల `ఆచార్య` సెట్స్ కి జాయిన్ అయ్యి తన భాగాన్ని పూర్తి చేయాలనే తెలివైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే ఆచార్య‌ విడుదల తేదీని క‌చ్చితంగా ప్లాన్ చేయటానికి వీలు కలుగుతుంది.

మెగాస్టార్ చిరంజీవి కథానాయ‌కుడిగా న‌టించే తాజా చిత్రంలో కొర‌టాల‌ కీలక పాత్రను రాయడానికి కార‌ణం ఎవ‌రో తెలిసిందే. చిరు కోరిక మేర‌కే అత‌డు ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసారు. మహేష్ బాబు ఆ పాత్రను చేయాలని కొర‌టాల భావించినా.. చివ‌రికి రామ్ చరణ్ చేయాల‌ని చిరు అన్నారు. దీంతో కొర‌టాల ప్లాన్ మార్చారు.

దాంతో చాలా స‌మ‌యం వృధా అయ్యింది. ఇక షూటింగ్ ప్రారంభించాలి అనుకోగానే మ‌హ‌మ్మారీ స‌మ‌స్యాత్మ‌కం అయ్యింది. వాయిదాల ఫ‌ర్వంతో చికాకు పుట్టుకొస్తోంది. కొరటాల శివ ఈ సినిమాకోస‌మే రెండేళ్లుగా వేచి చూశారు. నిర్మాణంలో నిరంతరం ఆలస్యం అవుతున్నందుకు బాధపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం తాను రెండేళ్ళకు పైగా వృధా చేశానని తన స్నేహితులకు చెప్పుకుని వాపోతున్నార‌ట‌. మొత్తానికి ఈ ప‌రిస్థితిని స‌మీక్షించి చిరు, చ‌ర‌ణ్ అందుబాటులోకి రావాల‌న్న డిమాండ్ ఊపందుకుంది. ఆ క్ర‌మంలోనే వారి ఆలోచ‌న‌లు మారుతున్నాయిట‌.