ఎరక్కబోయి ఇరుక్కున్న బాలయ్య, సీన్ లోకి సి కల్యాణ్?

బాలకృష్ణ ఎన్నడూ చూడని సమస్యలను కొత్తగా ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లూ చక్కగా హీరోగా నటిస్తూ వెళ్లిపోయిన ఆయన తొలిసారిగా బ్యానర్ పెట్టి తన తండ్రి బయోపిక్ ని నిర్మించారు. `క‌థానాయ‌కుడు`, `మ‌హానాయ‌కుడు` టైటిల్స్ తో రూపొందిన ఆ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోర్లా పడ్డాయి. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ వద్ద నుంచి వచ్చే ప్రెజర్ ని తట్టుకోవాల్సిన పరిస్దితి వచ్చింది. ఆ సెటిల్మెంట్స్ చేయనిదే వేరే ప్రాజెక్టు చేయటం నిర్మాతగా కష్టం.

ఎందుకంటే బాలయ్య నెక్ట్స్ ప్రాజెక్టు అదే బ్యానర్ పై నిర్మిస్తే వెంటనే వచ్చి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ తమ బకాయిలు తీర్చమంటారు. ఇదంతా గమనించిన బాలయ్య ప్రస్తుతానికి తను నిర్మాతగా కొనసాగటానికి బ్రేక్ ఇద్దామనుకుంటున్నారని సమాచారం. లేకుంటే తను బోయపాటి శ్రీను తో చేయబోయే చిత్రానికి నిర్మాతగా కొనసాగుదామనుకున్నారు. దాంతో ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు నిర్మాతను వెతకాల్సిన పరిస్దితి ఏర్పడింది.

బోయపాటి డిజాస్టర్ కొట్టి…నిర్మాత దానయ్యతో తగువు పడి వచ్చారు. ఈ నేపధ్యంలో ఓ వర్గం అతనికి సపోర్ట్ చెయ్యదు. దీంతో బాలయ్య ఇఫ్పుడు తనే నిర్మాతను వెతికే పనిలో పడ్డారని సమాచారం. ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న నేప‌థ్యంలో జూన్ లో సెట్స్ కు తీసుకెళ్లాల‌ని అనుకుంటున్నారుట‌. అందులో భాగంగా నిర్మాణ బాధ్య‌త‌ల్ని సి. క‌ళ్యాణ్ కు అప్ప‌గించిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. ఆ మ‌ధ్య ఈ కాంబినేష‌న్ లో `జై సింహ` తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాలు సాధించింది. ఇది బాల‌య్య కు 105వ సినిమా కావ‌డం విశేషం.