సినిమాల్లో చూపించుకో: బాలకృష్ణకు బొత్స వార్నింగ్

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎలక్షన్ క్యాంపైన్ చేస్తూ.. పనిలో పనిగా తరచుగా చేయిచేసుకుంటూ వార్తల్లోకెక్కుతున్నారు. తాజాగా, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కూడా ఓ అభిమానిపై చేయిచేసుకున్నారు. ఆ వీడియోలు అంతటా వైరల్ కూడా అయ్యాయి. దీనిపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడుతూ బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు.

”మీరు సినీ నటులైతే మీ యాక్షన్ ను సినిమాల్లో చూపించుకోండి అంతేగానీ వీధుల్లోకి వచ్చి మా ఊరి కుర్రాళ్లను కొడతానంటే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరు” అంటూ ఘాటుగా హెచ్చరించారు. బాలకృష్ణ చేతిలో దెబ్బలు తిన్నది టీడీపీ కార్యకర్తే కావొచ్చు.. కానీ అతను మా చీపురుపల్లి వాసి.. అందుకే అతడి తరఫున మాట్లాడుతున్నామని బొత్స అన్నారు.

అంతేకాదు… ఆ కుర్రాడికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మున్ముందు ఇలాంటివి జరిగితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. కనీస విలువలు వ్యక్తిత్వం లేకుండా ఇలా వీధుల్లోకి వచ్చి కొట్టడం ఏంటని బొత్స నిలదీశారు.

మరో ప్రక్క బాలకృష్ణ తీరును ఆయన భార్య సమర్థించుకురావడం కూడా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఓ టీవీ చానల్ తో మాట్లాడిన బాలయ్య భార్య వసుంధర.. తన భర్త అభిమానులతో చనువుగా ఉంటారని.. వారు కూడా ఇలాంటివాటికి సంతోషిస్తారని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.