కేక ఐడియా కదా: అల్లు అర్జున్ …ద్విపాత్రాభినయం

ఆఖరుగా ‘నా పేరు సూర్య’ సినిమాతో పలకరించిన అల్లు అర్జున్ కొత్త సినిమాను సెలెక్ట్ చేసుకోవడానికి చాలా సమయమే తీసుకున్నాడు. అనేక కథలు విన్నప్పటికి పెద్దగా నచ్చలేదు. విక్రమ్ కుమార్ తో సినిమా అనుకున్నా.. అనుకున్నట్టుగా స్క్రిప్ట్ రాకపోవడంతో సినిమాను పక్కన పెట్టారు. ఎట్టకేలకు అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పేశాడు.

మొదట ఓ బాలీవుడ్ రీమేక్ అనుకున్న ఇప్పుడు ఓ స్ట్రైయిట్ సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ కథలో బన్ని ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వినికిడి. గతంలో ఆయన వద్దకు రెండు మూడు ప్రాజెక్టులు ద్విపాత్రాభినయంతో వచ్చినా ఓకే చేయలేదు. కానీ ఈ సారి త్రివిక్రమ్ చెప్పిన పాయింట్ నచ్చటంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా కైరా అద్వానీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

మహేష్ చిత్రం భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బాలీవుడ్ సోయగం కైరా అద్వానీ. ఈ సినిమాతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన కైరా రీసెంట్ గా రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రంలో కనిపించింది. ఈ సినిమా రిలీజ్ కు ముందే ఆమె ఈ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది.

ఈ చిత్రం ఫిబ్రవరి రెండవ వారంలో ప్రారంభం కానుందని చెబుతున్నారు. అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్… సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి ఫన్ తో ,యాక్షన్ తో తండ్రి సెంటిమెంట్ తో సాగుతుందని చెప్పుకుంటున్నారు.