స‌రిలేరు, అల‌.. చిత్రాల‌కు మ‌రో గుడ్‌న్యూస్‌!

సంక్రాంతి కోడిపందాలు మొద‌ల‌య్యాయి. అదే రేంజ్‌లో బాక్సాఫీస్ స‌మ‌రం కూడా షురూ అయింది. ఈ పందెంలో `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో మ‌హేష్, `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో బ‌న్నీ బ‌రిలోకి దిగుతున్నారు. ఇద్ద‌రి ప్ర‌ధాన బ‌లం వినోద‌మే. వినోదాన్ని ప్ర‌ధానంగా న‌మ్ముకుని మ‌హేష్‌, బ‌న్నీ నువ్వా నేనా అనే స్థాయిలో పోటీప‌డ‌బోతున్నారు. ఇప్ప‌టికే వార్ డిక్లేర్ అయిపోయింది. ఈ ఇద్ద‌రిలో మహేష్ 11న బ‌రిలోకి దిగుతుంటే అల్లు అర్జున్ 12న సై అంటున్నాడు.

ఈ రెండు చిత్రాల‌కు ఇప్ప‌టికే ఏపీ ప్ర‌భుత్వం, తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక షోల విష‌యంలో వెసులు బాటుని క‌ల్పించి ఇద్ద‌రు హీరోల అభిమానుల‌కు గుడ్ న్యూస్‌ని ప్ర‌క‌టించేసింది. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం శుక్ర‌వారం మ‌రో ఆఫ‌ర్ ఇవ్వ‌డం ప్ర‌ధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ప్ర‌దర్శ‌న‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా అనుమ‌తినిచ్చింది. `స‌రిలేరు నీకెవ్వ‌రు` 11 నుంచి ఈ నెల 24 వ‌రకు, `అల వైకుంఠపుర‌ములో`కు ఈ నెల 12 నుంచి 25 వ‌ర‌కు ప్ర‌త్యేకంగా ఉద‌యం 7 గంట‌ల షోల‌కు అనుమ‌తినిచ్చారు.

తాజాగా తెలంగాణ‌లో ఈ రెండు చిత్రాల‌కు మ‌రో గుడ్ న్యూస్‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు కాబ‌ట్టి వారం రోజుల పాటు టిక్కెట్ రేట్లు పెంచుకోవ‌డానికి అనుమ‌తినిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే ఎంత వ‌ర‌కు పెంచుకోవాలి. ఆ రేట్లు ఎలా వుంటాయ‌న్న విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు.