ఆది సాయికుమార్ కథానాయకుడిగా కాశ్మిరీ పండితుల గురించి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ఈ చిత్రంలో రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా కనిపిస్తారు. ఆది ఎన్.ఎస్.జి కమాండో గా కనిపిస్తారు. సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. విజయదశమి సందర్భంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.
అనంతరం కార్యక్రమంలో సాయికిరణ్ అడివి మాట్లాడుతూ ‘‘మాది క్రాస్ జోనర్ ఫిల్మ్. వాస్తవ ఘటనలు, సంఘటనల ఆధారంగా తీసిన ఫిక్షనల్ ఫిల్మ్. కశ్మీర్ నుండి ఇతర ప్రాంతాలకు వచ్చి సెటిలైన కశ్మీర్ పండిట్స్తో కూర్చుని, వాళ్లతో మాట్లాడి… అసలేం జరిగింది? అని సమస్య లోతుల్లోకి వెళ్లి, కంప్లీట్ రీసెర్చ్ చేసి అబ్బూరి రవి కథ రాశారు. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్, ఘాజీ బాబా పాత్రలో అబ్బూరి రవి నటించారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాను కూడా చూస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.